తెలంగాణ

telangana

బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడు

బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు. రోజుకో ఏదో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తవ్వేకొద్ది కేసులు బయటకు వస్తున్నాయి. డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుగొల్పుతున్నాయి. బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి మామను అల్లుడే హత్య చేసిన ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామంలో వెలుగు చూసింది. దీనికి కూతురు సహకరించడం నమ్మలేని నిజం. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు పోలీసులు.

By

Published : Mar 11, 2021, 8:01 AM IST

Published : Mar 11, 2021, 8:01 AM IST

The son-in-law who killed his uncle for insurance money  in nalgonda district
బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడు.. ఐదుగురు అరెస్ట్​

బీమాసురుల ఆగడాలు రోజుకొకటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడితో పాటు అతనికి సహకరించిన మృతుడి కుమార్తెను, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తవ్వేకొద్ది ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.!

నాగార్జునసాగర్‌ సీఐ గౌరునాయుడు కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన బిక్నానాయక్‌(45).. తన కుమార్తె బుజ్జిని దామరచర్ల మండలం పుట్టలతండాకు చెందిన భాష్యానాయక్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత 2015 ఫిబ్రవరిలో బిక్నానాయక్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కారణంగా మృతిచెందారని అప్పట్లో కేసు నమోదైంది. బీమా డబ్బుల కోసం హత్య కేసులు వెలుగుచూడడంతో పోలీసులు అనుమానం ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారు.

ప్రమాదంగా చిత్రీకరించి...

బిక్నానాయక్‌ కేసు కూడా తిరిగి విచారణ చేపట్టగా.. భాష్యానాయకే మామను హతమార్చినట్లు తేలింది. తన భార్య బుజ్జిని నామినీగా పెట్టి మామ బిక్నానాయక్‌పై పలు పాలసీలు చేయించిన భాష్యానాయక్‌.. ఒకరోజున మామకు మద్యం తాగించి హత్యచేశాడు. తర్వాత రవి, రాజేశ్వర్‌రావు, నరేష్‌తో కలిసి ట్రాక్టర్‌తో తొక్కించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా మూడు ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఐదు పాలసీల ద్వారా రూ. 79.65 లక్షలు తీసుకున్నాడని సీఐ వివరించారు. నిందితులైన భాష్యానాయక్‌, రవి, రాజేశ్వరరావు, నరేష్‌, బుజ్జిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. ఇందులో బీమా ఏజెంట్ల ప్రమేయంపై లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details