Step Mother Killed Step Son : అభం శుభం తెలియని చిన్నారిని కాపాడాల్సిన సవతి తల్లి కర్కశంగా వ్యవహరించింది. వేధిస్తుంటే తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడని భవనం పైనుంచి తోసింది. బతికి బయటపడ్డాడని గొంతు నులిమి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది.
పసివాడిని భవనంపై నుంచి తోసేసి.. బతికున్నాడని గొంతు నులిమిన సవతి తల్లి - step mother killed her step son
Step Mother Killed Step Son : భార్య చనిపోయిన తర్వాత.. ఏడాది వయసున్న కుమారుడికి తల్లిలేని లోటు తీర్చాలని మరో పెళ్లి చేసుకున్నాడు ఆ తండ్రి. తనకు రెండో భార్యగా వచ్చిన మహిళ తన కొడుకుని కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందనుకున్నాడు. తల్లిగా తన ఆలనాపాలనా చూడాల్సిన ఆ మహిళ.. ఆ బాలుడిని విపరీతంగా వేధించడం మొదలుపెట్టింది. ఆ విషయం వాళ్ల నాన్నకి చెప్పాడని కోపంతో అతణ్ని భవనం పై నుంచి తోసింది. అయినా బతికాడని ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత గొంతు నులిమి చంపేసింది.
![పసివాడిని భవనంపై నుంచి తోసేసి.. బతికున్నాడని గొంతు నులిమిన సవతి తల్లి Step Mother Killed Step Son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15359487-thumbnail-3x2-a.jpg)
సీఐ హబీబుల్లాఖాన్ వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లికి చెందిన భాస్కర్ భార్య రత్నమాల ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న ఉజ్వల్ కుమారుడు ఉన్నాడు. భాస్కర్ సరిత(31)ను రెండో వివాహం చేసుకున్నాడు. భార్య, కుమారుడు సహా రెండేళ్ల కిందట నగరానికి వచ్చాడు. గోల్నాకలో అద్దె ఇంట్లో ఉంటూ.. మేస్త్రీ పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ఆర్నెల్ల పాప ఉంది.
ఉజ్వల్(7) ఒకటో తరగతి చదువుతున్నాడు. వారుంటున్న భవనం మొదటి అంతస్తు నుంచి 15 రోజుల క్రితం ఉజ్వల్ పడిపోయాడు. ఇంటి యజమాని గమనించి ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. కోలుకుని ఇంటికి వచ్చిన బాలుడు శనివారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సవతి తల్లిని అనుమానించి విచారించగా ఉజ్వల్ను గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పింది. భవనంపై నుంచి తోసినా బతకడంతో గొంతు నులిమానని అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.