Kodangal Boy Missing Case Update: వికారాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్, ఆపై హత్యకు సంబంధించిన కేసు వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డబ్బు కోసమే నిందితుడు అజయ్.. రజాఖాన్ను హత్య చేసినట్లు చెప్పారు. శుక్రవారం గాంధీనగర్లో సైకిల్పై వెలుతున్న రజాఖాన్ను.. అదే కాలనీలో నివాసం ఉంటున్న అజయ్ చాక్లెట్లు ఇప్పిస్తానని తన వెంట ఇంటికి తీసుకెళ్లాడని అన్నారు. ఆ తర్వాత నిన్ను కిడ్నాప్ చేశానని.. మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతానని ఆ బాలుడిని భయపెట్టడాని తెలిపారు.
భయంతో రజాఖాన్ గదిలో గట్టిగా కేకలు వేశాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వెంటనే అజయ్ తన గదిలో ఉన్న సుత్తెను తీసుకొని బాలుడిపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. శనివారం రాత్రి మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న సూట్కేసులో పెట్టి ఉంచాడని అన్నారు. మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లేందుకు తన స్నేహితుడు హరిని సహాయం కోరగా అందుకు అతను నిరాకరించాడని తెలియజేశారు.
దీంతో ఆదివారం రోజు ఎవరూ లేని సమయంలో కొడంగల్ పట్టణం శివారులో ఉన్న వసతి గృహ సమీపంలోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. నిందితుడు అజయ్పై అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో అతడిని అదుపులోనికి తీసుకొని విచారించంగా.. తానే నేరం చేసినట్టు ఒప్పుకొన్నాడని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. చిన్నారి మృతితో వికారాబాద్ కొడంగల్లో పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. బాలుడి మృతికి నిరసనగా పలు సంస్థలు బంద్ ప్రకటించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.