తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 9:58 PM IST

ETV Bharat / crime

దారుణం: మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చాడు

అమ్మ అంటే మనకు జన్మనిచ్చిన దేవత. అమ్మకు సేవ చేయడం మనకు లభించిన అదృష్టం. అలాంటి మాతృమూర్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. కన్న తల్లి అని చూడకుండా మద్యం మత్తులో అంతమొందించాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండలో చోటు చేసుకుంది.

Son murdered mother in kandhikonda village
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండలో దారుణ ఘటన

అమానుషం..దారుణం... కర్కశత్వం..అమానవీయం.. ఇలా ఎన్ని పదాలు వాడినా సరిపోవు. అలాంటి అత్యంత పాశవిక ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకే తల్లిని దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన దుస్స కమలమ్మ(65)ను సిమెంటు ఇటుకతో కొట్టి చంపేశాడు.

దారుణం జరిగిందిలా....

గ్రామానికి చెందిన దుస్స కమలమ్మ కుమారుడు నర్సయ్య మద్యానికి బానిసైయ్యాడు. దీంతో కుటుంబంలో తరచూ గొడవలు తలెత్తడంతో అతని భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మద్యం మత్తులో గ్రామంలో పలువురితో గొడవలు పడేవాడు. మంగళవారం సైతం ఒకరితో తగాదా పెట్టుకోగా తల్లి కుమారుడికి నచ్చ జెప్పింది. అనంతరం అక్కడ నుంచి అదే గ్రామంలోని తన కుమార్తె ఇంటికి వచ్చి భోజనం చేస్తోంది. ఈ క్రమంలో నర్సయ్య అక్కడికి చేరుకుని సిమెంటు ఇటుకతో తల్లిపై దాడి చేశాడు. రెండోసారి ఇటుకతో ముఖంపై బాదడంతో తీవ్రంగా గాయపడిన కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మరిపెడ సీఐ సాగర్‌, ఎస్సై రాణాప్రతాప్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు నర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిని తనయుడు హత్య చేశాడన్న విషయం తెలిసి గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి:ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ టీకాలకు ప్రభుత్వం మళ్లీ అనుమతి

ABOUT THE AUTHOR

...view details