Cars Thief Arrest: హైదరాబాద్లోని చైతన్యపురి పీఎస్ పరిధిలోని రెండు నెలల క్రితం ఓ కారు చోరికి గురైంది. కార్లు అద్దెకు ఇచ్చే జూమ్ కార్స్ కార్యాలయానికి వచ్చిన ఓ యువకుడు క్రెటా కారును అద్దెకు తీసుకున్నాడు. నిర్వాహకులు అడిగిన ద్రువపత్రాలతో పాటు అడ్వాన్సు కూడా చెల్లించాడు. రెండు రోజుల అద్దెకు తీసుకెళ్లిన యువకుడు వారం గడిచిన తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. అనుమానం వచ్చిన సిబంది వెంటనే పైఅధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వాళ్ల సూచన మేరకు చైతన్యపురి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 కేసులు..
చోరీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఏపీలోని భీమవరంకు చెందిన మహేష్ కుమార్గా గుర్తించారు. దర్యాప్తు చేసి మహేష్కుమార్తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ఖరీదైన కార్లతో పాటు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. మహేష్పై ఏపీ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబంగ, ఒడిశాలో కలిపి మొత్తం 16 కేసులున్నట్లు సీపీ తెలిపారు.
ఫోన్లతో మొదలుపెట్టి కార్ల దాకా..
భీమవరం మండలం చిన్నమిరంకు చెందిన మహేష్కుమార్.. ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో భీమవరంలో మొబైల్ దుకాణంలో పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలని చరవాణిలు చోరీ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత హైదరాబాద్కు వచ్చి సరూర్నగర్లోని ఓ మొబైల్ షోరూంలో పనికి కుదిరాడు. అందులో చరవాణిలో చోరీ చేసిన విషయం బయటపడడంతో మలక్పేట పోలీసులు 2016లో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. బెయిల్పై బయటకు వచ్చిన మహేష్.. ఈసారి కార్లు దొంగలించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం కార్లు అద్దెకు ఇచ్చే సంస్థలను ఎంచుకున్నాడు.