MLA Jeevan Reddy murder attempt: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హత్యకు కుట్ర వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు ప్రసాద్... తన కణతపై తుపాకీ గురి పెట్టి చంపుతానని బెదిరించినట్టు జీవన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసానికి సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రసాద్ అనే వ్యక్తి వచ్చాడు. నేరుగా జీవన్రెడ్డి వద్దకు వెళ్లి తుపాకీని కణతకు గురి పెట్టి చంపుతానని బెదిరించాడు. అప్రమత్తమైన అంగరక్షకులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. తనిఖీ చేయగా ప్రసాద్ వద్ద రెండు తుపాకులు, కత్తి బయటపడిందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
సమాచారం వెంటనే పోలీసులకు తెలపడంతో వారు జీవన్రెడ్డి నివాసానికి చేరుకుని ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం కల్లెడ గ్రామపంచాయతీ సర్పంచ్గా ఉన్న లావణ్యను 6 నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే సర్పంచ్ను సస్పెండ్ చేయించారని కక్ష్య పెంచుకున్న ఆమె భర్త ప్రసాద్... జీవన్రెడ్డి పై హత్యయత్నం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్ను పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నేపాల్లో రూ.50 వేలకు పిస్టల్ కొనుగోలు:దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుని ఫోన్లోని వివరాలను విశ్లేషించారు. కొద్దిరోజుల క్రితం నేపాల్కు వెళ్లిన ప్రసాద్గౌడ్ రూ.50 వేలకు పిస్టల్ను కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. తూటాలు కొనుగోలు చేయలేదని గుర్తించారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, ఎస్సై బాలరాజు జీవన్రెడ్డి ఇంటికి చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
భార్య సర్పంచి పదవి పోయిందనే కక్షతోనే:ప్రసాద్గౌడ్ భార్య లావణ్య భాజపా మద్దతుతో కల్లెడ సర్పంచిగా గెలిచారు. కొద్ది రోజులకే అధికార తెరాసలో చేరారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి కారణంగానే తన భార్య పదవి పోయిందనే కోపంతో ప్రసాద్గౌడ్ ఆయనపై పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే కొద్దిరోజులుగా రెక్కీ నిర్వహిస్తూ తాజాగా హత్యాయత్నానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.