తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘం, విరసం నాయకుల ఇళ్లలో బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.
మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారని గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గ్రామీణ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లో ఒక వార్తా ఛానల్ విలేకరి పొంగి నాగన్నపై కేసు నమోదయింది. తర్వాత ఈ కేసు ఎన్.ఐ.ఎ.కు బదిలీ అయింది. దీనికి సంబంధించి మార్చి 7న హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్ఛార్జి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్తోపాటు వివిధ ప్రజాసంఘాలకు చెందిన మొత్తం 64 మందిపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సరూర్నగర్ పీ అండ్ టీ కాలనీలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్, మెహిదీపట్నంలోని ప్రజానాట్య మండలి మాజీ కళాకారుడు డప్పు రమేష్, జవహర్నగర్లోని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు జాన్, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి, కర్నూలు జిల్లాలోని విరసం నాయకులు పినాకపాణి, అరుణ్ (సోమశేఖర శర్మ)ల ఇళ్లలో సోదాలు జరిపారు. విశాఖపట్నం పిఠాపురంకాలనీ లోని న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్.చలం, రాజమండ్రిలో ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
రఘునాథ్ అరెస్ట్..