తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2022, 9:38 AM IST

ETV Bharat / crime

బావతో ఇష్టంలేని పెళ్లి.. వారం తిరగకముందే బలవన్మరణం

Newly Wed Bride Suicide in Kushaiguda: కష్టపడి చదివి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసింది. తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలని ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేరింది. కష్టపడి సంపాదించి తండ్రికి సాయంగా నిలవాలనుకుంది. ఇంతలోనే పెళ్లి చేస్తామంటూ కన్నవాళ్లు తెచ్చిన ప్రపోజల్‌తో షాక్‌ అయింది. దగ్గరివాడు.. తెలిసిన వాడు అని.. మేనబావను పెళ్లిచేసుకోమని తల్లిదండ్రులు చెప్పగా.. తనకు ఇష్టం లేదని చెప్పింది. అయినా వారు ఒత్తిడి చేయడంతో గతిలేక చివరకు ఒప్పుకుంది. ఇష్టం లేకుండానే మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కానీ ముప్పై రోజులు కూడా ఇష్టంలేని వాడితో బతకలేకపోయింది. వివాహమైన వారం రోజులకే బలవన్మరణానికి పాల్పడి తన కలలతో పాటు కన్నవాళ్ల కలలను కలగానే మిగిల్చింది. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

Newly Wed Bride Suicide in Kushaiguda
Newly Wed Bride Suicide in Kushaiguda

Newly Wed Bride Suicide in Kushaiguda : మేనబావతో పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అడగ్గానే తనకు ఇష్టం లేదని చెప్పింది. తెలిసినవాడు బాగా చూసుకుంటాడని తల్లిదండ్రులు చెప్పినా.. తనకు కావాల్సింది తెలిసిన వాడు కాదని.. తనకు నచ్చినవాడని క్లారిటీ ఇచ్చింది. అయినా చివరకు కన్నవాళ్ల కట్టడికి తలొగ్గక తప్పలేదు. ఇష్టం లేకపోయినా.. తల్లిదండ్రులను ఎదిరించలేక.. ఎదిరించి బతకలేక.. తలొంచి తాళి కట్టించుకుంది. కానీ.. వివాహం జరిగిన తర్వాత ఇష్టం లేని వాడితో బతకడం ఎంత కష్టమో అర్థమైంది. అటు తల్లిదండ్రులకు చెప్పలేక.. ఇటు నచ్చని వాడితో కాపురం చేయలేక నరకం అనుభవించింది. పెళ్లి జరిగి వారం కూడా అవ్వకముందే.. కాళ్ల పారాణి కూడా ఆరకముందే.. తన మెడలో పడిన పసుపు తాడును ఉరితాడుగా భావించిన ఆ యువతి నిజంగానే తన మెడకు ఉరి బిగించుకుంది. బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.

ఎస్సై ఎం.సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Newly Wed Woman Suicide in Kushaiguda : చర్లపల్లిలోని ఈసీనగర్‌కు చెందిన పి.యాకాంతం ప్రైవేటు ఉద్యోగి. ఆయన కూతురు శైలజ(22) ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తి చేసింది. కొంతకాలం ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రిలో పని చేశారు. ఇటీవల ఉప్పల్‌లోని టీఎక్స్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధుల్లో చేరింది. ఆమె మేనబావ స్వగ్రామం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో ఈ నెల 17న పెద్దలు వివాహం చేశారు. వేడుక అనంతరం 22న కుటుంబ సభ్యులంతా ఈసీనగర్‌ వచ్చారు. బుధవారం ఉదయం అతను సంగారెడ్డిలోని కంపెనీకి ఉద్యోగానికి వెళ్లాడు. బెడ్‌రూంలో తల్లి ఉండగా..ఆమె బయటి నుంచి గడియ వేసింది. హాల్‌లో ఉన్న ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తీశారు. అప్పటికే ఫ్యానుకు వేలాడుతున్న శైలజను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. వివాహానికి ముందు మేనరికం ఇష్టం లేదని చెప్పిందని, అందుకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details