తెలంగాణ

telangana

ETV Bharat / crime

karvy stock broking: పోలీస్​ కస్టడీకి కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి.. కోర్టు అనుమతి - తెలంగాణ వార్తలు

karvy Chairman Parthasarathy
karvy Chairman Parthasarathy

By

Published : Aug 24, 2021, 4:51 PM IST

Updated : Aug 24, 2021, 7:28 PM IST

16:49 August 24

పోలీస్​ కస్టడీకి కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి

కార్వీ స్టాక్ బ్రోకింగ్(karvy stock broking) సంస్థ ఛైర్మన్ పార్థసారథిని రెండు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. బుధ, గురువారం రెండు రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్‌లో ఉంచి ప్రశ్నించనున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో  పోలీసులు పార్థసారథిని ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

తెలియకుండా షేర్లు తనఖా

బ్యాంకు నుంచి రూ.137కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో డీమాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులకు తెలియకుండా పార్థసారథి, ఇతర డైరెక్టర్లు కలిసి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టారు. కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. కేసులో మరింత పురోగతి సాధించడానికి కస్టడీ ఇవ్వాలన్న పోలీసుల వాదనను అంగీకరిస్తూ నాంపల్లి న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

2009లోనే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన డబ్బులను మళ్లించినట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై 2009లోనే కేసు నమోదైంది. ఆయన డీమాట్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నగదు తనకు తెలియకుండా మళ్లించినట్లు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మేనేజర్‌తో పాటు ఛైర్మన్ పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ల మీద  పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మేనేజర్ మాత్రమే న్యాయస్థానంలో విచారణకు హాజరవుతున్నారు.  

పీటీ వారెంట్‌

ఛైర్మన్ పార్థసారథి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇండస్ ఇండ్ బ్యాంకు కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో... భీమవరం పోలీసులు పీటీ వారెంట్‌పై పార్థసారథిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను సంప్రదించి శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు అందించారు. రెండు, మూడు రోజుల్లో నాంపల్లి న్యాయస్థానంలో భీమవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

బిగుస్తున్న ఉచ్చు

కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఛైర్మన్ పార్థసారథికి ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలీ పీఎస్‌లోనూ కేసు నమోదు చేశారు. షేర్లను తనఖా పెట్టి రూ.500 కోట్లకు పైగా రుణం తీసుకోని తిరిగి చెల్లించలేదని ఐసీఐసీఐ ప్రతినిధులు గచ్చిబౌలీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు రుణం చెల్లించలేదని ఐసీఐసీఐ పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.... సీపీ సజ్జనార్ ఆదేశాలతో కేసును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగానికి బదిలీ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక నేర విభాగం పోలీసులు సేకరిస్తున్నారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను... కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు చెందిన షేర్లుగా బ్యాంకర్లను నమ్మించి కోట్ల రూపాయల్లో రుణం తీసుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:Karvy: కార్వీ బ్రోకింగ్​ సంస్థపై బ్యాంకుల ఫిర్యాదు.. ఎందుకంటే?

Last Updated : Aug 24, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details