తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత

ఏపీలోని గుంటూరు జిల్లా నంబూరులో రెండేళ్ల బాలుడి అపహరణ ఉదంతాన్ని పోలీసులు సుఖాంతం చేశారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లాడిని అపహరించి రూ.రెండు లక్షలకు అమ్ముకుందామన్న ఓ ముఠా కుట్రను భగ్నం చేసి.. ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. రూ.1.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కుమారుడిని క్షేమంగా అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

By

Published : Feb 28, 2021, 10:40 PM IST

guntur police
బాలుడి కిడ్నాప్​ guntur policeకేసును ఛేదించిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత

పిల్లలను అపహరించి గుట్టుగా అమ్ముకుందామనుకున్న ఓ ముఠా ప్రయత్నాలను ఏపీలోని గుంటూరు అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. ఈనెల 24న గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు యానాది కాలనీలో రెండేళ్ల బాలుడు జీవా.. అపహరణకు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యేసరికి తల్లి బాలకు అనుమానం వచ్చింది. అంతకు ముందు కారు ఆపి... తనను నీళ్లు కావాలని అడిగినవారే.. ఆ పని చేశారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

బాలుడి అపహరణ కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు.... కారుతోపాటు ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించి ముఠా ఆట కట్టించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన అనిశెట్టి సువర్ణ, అనిశెట్టి దుర్గా ప్రసాద్, అమరాలపూడి శ్రీనివాసరావు, పోకూరి సాగర్, కడప పట్టణంలోని బాలాజీనగర్​కు చెందిన వరదా చంద్రిక ప్రతిభా భారతి అలియాస్ చంద్రిక, విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా బంగారయ్యపేటకు చెందిన దుర్గాడ వేణును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి రూ.1,20,000 నగదు, 10 లక్షలు విలువచేసే కారు, చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారు విజయవాడకు చెందిన శివ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించిన పోలీసులు.. అక్కడ నుంచి తీగలాగితే డొంక కదలింది. వేణు అనే అమ్మాయికి మగపిల్లాడిని అమ్మేందుకు రూ.2 లక్షలకు సువర్ణ, చంద్రిక చేసుకున్న ఒప్పందమే... పిల్లాడు జీవా.. అపహరణకు కారణమని పోలీసు అధికారులు తెలిపారు. అపహరణ ఉదంతంలో కీలకపాత్ర పోషించిన భార్యాభర్తలు సువర్ణ, దుర్గాప్రసాద్​తోపాటు అతనికి సహకరించిన మిగతా నిందితులను అరెస్టు చేశామని డీఐజీ త్రివిక్రమ్​ వర్మ, ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు. తమ కుమారుడిని తిరిగి క్షేమంగా అప్పగించిన పోలీసులకు.. తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత

ఇవీచూడండి:కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!

ABOUT THE AUTHOR

...view details