తెలంగాణ

telangana

By

Published : May 25, 2021, 12:13 PM IST

ETV Bharat / crime

సిలిండర్ పేల్లేదు... షార్ట్ సర్క్యూట్ జరగలేదు.. మరి ఏమైంది?

ఆ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ఆర్థిక ఇబ్బందులు లేవు.. సొంత ఇల్లు.. ఇద్దరు పిల్లలతో కాపురం సంతోషంగా సాగిపోతోంది. సోమవారం ఆ ఇంట్లో ఒక్కసారిగా రేగిన మంటల్లో ఇల్లాలు సజీవంగా దగ్ధమవడం తీవ్ర కలకలం రేపింది. పిల్లలను కాపాడే క్రమంలో ఆమె భర్తకు గాయాలయ్యాయి.

mystery-in-vanasthalipuram-women-death-case
సిలిండర్ పేల్లేదు... షార్ట్ సర్క్యూట్ జరగలేదు.. మరి ఏమైంది?

నల్గొండ జిల్లా మాల్‌ సమీపంలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చల్లం బాలకృష్ణ (51), సరస్వతి (42) దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నగరంలోని వనస్థలిపురం పరిధి ఎఫ్‌సీఐ కాలనీలో సొంతింట్లో ఉంటున్నారు. బాలకృష్ణ నల్గొండ సమీపంలోని బ్రాహ్మణవెళ్లిలో.. సరస్వతి ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు వెంకటరమణ (22), కుమార్తె అక్షిత (15) ఉన్నారు. కాగా బాలకృష్ణది రెండో వివాహం. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. పదిహేనేళ్ల క్రితం సరస్వతిని పెళ్లాడాడు. వెంకటరమణ మొదటి భార్య కుమారుడు.

ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా గొడవ పడ్డారు. అప్పటికే పిల్లలిద్దరూ వేరే గదిలో ఆన్‌లైన్‌ క్లాసులో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బెడ్‌రూంలో నుంచి మంటలు చెలరేగాయి. బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చాడు. సరస్వతి కోసం మళ్లీ లోపలికి వెళ్లగా ఆమె పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో కాపాడలేకపోయాడు. ఈ క్రమంలో బాలకృష్ణ ముఖం, చేతులకు కాలిన గాయాలయ్యాయి. ఇంట్లో నుంచి పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ప్రమాదం రెండో అంతస్తులో జరగడంతో మంటలను అదుపుచేసేందుకు సిబ్బంది గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. సరస్వతి సజీవ దహనమైనట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బాలకృష్ణను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించింది. షార్ట్ సర్క్యూట్ జరగలేదని... సిలిండర్ పేలడం లాంటి ఘటనలు చోటు చేసుకోలేదని నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, ఇది ప్రమాదమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:ఇంట్లో చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details