తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2021, 3:12 PM IST

ETV Bharat / crime

రూ.26కోట్ల విలువైన మున్సిపాలిటీ భూములు మాయం..

పురపాలికకు దక్కాల్సిన లేఅవుట్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. తమ పలుకుబడితో ముడుపులు అప్పగించి ఖాళీ జాగాల్ని అమ్ముకుంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పురపాలికలో ఇప్పటికే 13 వేల గజాల లేఅవుట్లు అన్యాక్రాంతమయ్యాయి. వాటి విలువ రూ.26 కోట్లు ఉంటుందని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందింది.

municipal lands encroachment in huzurnagar
13 వేల గజాలు అమ్మేశారు... పట్టించుకునే వారు కరువయ్యారు

సాధారణంగా పురపాలికల పరిధిలోని లేఅవుట్ స్థలాల జాబితాలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రదర్శించి... అవి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించాలి. కానీ లేఅవుట్ల ద్వారా పురపాలికకు సంక్రమించిన స్థలాలు... సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో పదేళ్లుగా అన్యాక్రాంతమవుతున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి పురపాలికగా హుజూర్​నగర్ అవతరించిన తర్వాత... అనేక ఆస్తుల అమ్మకాలు జరిగాయి. చాలా స్థలాలు లేఅవుట్ల కింద ఇచ్చినట్లే ఇచ్చి... తర్వాత వాటిని అధికారులు, రాజకీయ నాయకులు కలిసి అమ్ముకున్నారు.

13 వేల గజాలు అమ్మేశారు..

హుజూర్​నగర్​లో దాదాపు 50 వెంచర్లు ఉండగా... అందులో 70 వేల గజాల లేఅవుట్ స్థలాలు ఉండాలని అక్కడివారు చెబుతున్నారు. అందులో 13 వేల గజాలు ఆక్రమించి అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వెంచర్లు ఏర్పాటు చేస్తున్నవారు సైతం... చడీచప్పుడు లేకుండా స్థలాల్ని అమ్ముకుంటున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.

నాయకుల అండదండలతో

హుజూర్​నగర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడటం, భూమి తక్కువగా ఉండి ధరలు అమాంతం పెరగడంతో... అక్రమార్కుల దృష్టి పురపాలిక లేఅవుట్లపై పడింది. ఆయా ప్రాంతాల్లోని స్థలాలు అమ్ముకుని... కోట్లు సంపాదిస్తున్నారు. కానరాకుండా పోయిన 13 వేల గజాల స్థలం విలువ... రూ.26 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసిన వారు సాధారణంగా లేఅవుట్ కింద ఇచ్చే భూమిని... ముందుగానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అగ్రిమెంటు రూపంలో వాటిని ఇచ్చి... తర్వాత అధికారులు, నాయకుల అండతో ఒప్పందాలు మాయం చేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఈ తతంగంపై అధికార పార్టీ కౌన్సిలర్లు... సర్వసభ్య సమావేశంలో నిలదీశారు. పురపాలికకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య నాయకులే... అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమాలు బయటపెట్టిన తమను... పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడుతున్నారు.

కొన్ని ఆక్రమణలపై ఇప్పటికే కలెక్టరుకు ఫిర్యాదు చేసి ఆపగలిగిన పురపాలిక అధికారులు... అన్యాక్రాంతమైన భూముల్ని సైతం స్వాధీనం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:చివరికి గ్రేహౌండ్స్‌ భూములనూ వదల్లేదు!

ABOUT THE AUTHOR

...view details