తెలంగాణ

telangana

Wife Kidnap: భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. ఎందుకంటే?

By

Published : Dec 2, 2021, 10:47 AM IST

Wife Kidnapped by Her Husband: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కలతలు వారి మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకున్న భర్త... స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

Wife Kidnapped by Her Husband
ములుగులో కిడ్నాప్

Wife Kidnapped by Her Husband: కట్టుకున్న భార్యను మిత్రులతో కలిసి భర్త కిడ్నాప్‌ చేసిన సంఘటన బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గోవిందరావుపేటకు చెందిన శాంతి(21)ని ఆమె భర్త చంద్రగిరి బాలరాజు తన స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చి జాతీయరహదారి వెంట ఉన్న తన మామయ్య ఇంట్లోకి చొరబడి శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు. అడ్డుపడిన అత్త రజిని, బావమరిది సృజన్‌ను పక్కకు నేట్టేసి కార్లో ఎక్కించుకుని వెళ్లిపోయాడు.

గోవిందరావుపేటకు చెందిన దామల్ల సుధాకర్‌, రజిని దంపతులు వృత్తి రీత్యా హనుమకొండలో నివాసం ఉండేవారు. హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తున్న వారి కూతురు శాంతి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో గత ఏప్రిల్‌లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో కలతలు ఏర్పడి శాంతి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులతో విషయం చెప్పగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుదామన్నారు. ఇంతలో ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్‌ కుటుంబ సభ్యులందరూ వెళ్లగా బాలరాజు తన స్నేహితులతో కలిసి శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ మేరకు ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటి నుంచి తప్పించుకొని శాంతి పుట్టింటికి చేరుకుంది. నర్సింగ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత మాట్లాడి పంపిస్తామమని ఆమె తల్లిదండ్రులు బాలరాజుకు చెప్పారు. అయినా వినకుండా బాలరాజు బుధవారం స్నేహితులతో కలిసి శాంతిని కిడ్నాప్‌ చేశాడు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై సీహెచ్‌.కరుణాకర్‌రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details