తెలంగాణ

telangana

By

Published : Feb 23, 2022, 9:35 AM IST

ETV Bharat / crime

Case Registered on CBI Officer : వివేకా హత్య కేసు.. సీబీఐ అధికారిపై ఏపీ పోలీసుల కేసు

Case Registered on CBI Officer : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కేసు నమోదైంది. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారని కడప కోర్టులో ఉదయ్ కుమార్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Case Registered on CBI Officer
Case Registered on CBI Officer

Case Registered on CBI Officer : మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ బెదిరిస్తున్నారని, దాడి చేశారని, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐపీసీలోని 195ఏ, 323, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద ఈ నెల 18న కడపలోని రిమ్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కడప ఫస్ట్‌ క్లాస్‌ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌, స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినట్లు అందులో వివరించారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను వేధిస్తోందని, ఏఎస్పీ రామ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఈ కేసులో అనుమానితుడైన గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి ఈ నెల 15న కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అంతకు ముందు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.

ఎవరీ ఉదయ్‌కుమార్‌రెడ్డి?

Case On CBI Officer in Viveka Murder Case : గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేశారు. వివేకా మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఉదయ్‌కుమార్‌రెడ్డిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ‘వివేకా మృతి సమాచారం అందరికంటే ముందు ఉదయ్‌కుమార్‌రెడ్డికే తెలుసు. హత్య జరిగిన రోజు వేకువజామున 3.30 గంటలకే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన తల్లి సాధారణ సంభాషణల్లో ఆమె స్నేహితులకు చెప్పారు’ అంటూ సునీత ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలు మార్లు విచారించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి గజ్జల ప్రకాశ్‌రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవారు. వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు ఆయనే కట్లు కట్టారు. సీబీఐ ఆయననూ పలుమార్లు విచారించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న సీబీఐ ఏఎస్పీపైనే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details