జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారంలో వారం క్రితం జరిగిన భూవివాదం ముగ్గురి హత్యకు దారితీయగా... దాడి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మంజునాయక్, ఆయన కుమారులు సారయ్య నాయక్, భాస్కర్ నాయక్లపై సోదరుడు మహంకాళి, ఆయన కుమారులు దాడి చేశారు.
కళ్లలో కారం చల్లి..
బాధితుల కళ్లలో కారం చల్లి... గొడ్డళ్లతో దారుణంగా చంపినట్లు వీడియోల్లో రికార్డు అయ్యింది. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. రెండు కుటంబాల మధ్య ఘర్షణ తలెత్తి హత్యలకు దారి తీసిందని స్థానికులు తెలిపారు.
మృతుడి ఫోన్లో దృశ్యాలు
భాస్కర్ నాయక్ చనిపోయే ముందు... దాడికి సంబంధించిన కొన్ని దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించగా... అవి ప్రస్తుతం వైరల్ అయ్యాయి. హత్యకు సంబంధించి నిందితులందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారంలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య చెలరేగిన భూవివాదం.. ముగ్గురిని కడతేర్చింది. తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. పొలం హద్దుల విషయంలో గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు పొలం వద్ద... రెండు కుటుంబాలు సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రమై.. మంజూ నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్ల కళ్లల్లో కారం చల్లి.. ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. వారు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
కారణం అదేనా?
18 ఎకరాల పొలానికి సంబంధించి మంజూనాయక్.. అతని తమ్ముని కుటుంబాల మధ్య చాలా రోజుల నుంచి భూవివాదం నడుస్తోంది. పలుమార్లు ఘర్షణపడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదే విషయంలో వీరి కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. ఈ మూడు హత్యలకు దారితీసింది. విషయం తెలుసుకున్న కాటారం పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:TRIPLE MURDER: వ్యవసాయ భూమిలో త్రిపుల్ మర్డర్