ఆంధ్రప్రదేశ్లోని ప్రశాంత విశాఖలో మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చాప కింద నీరులా సాగుతున్నాయి. నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని వీటి విక్రయాలు సాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ విషయంలో విశాఖ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించి భారీగా కేసులు నమోదు చేస్తున్నారు.
గోళ్ల రంగు పేరిట దిగుమతి...
నగరంలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్ల విక్రయాలు ఒకానొక దశలో జోరుగా సాగి తర్వాత కొంత మేర తగ్గాయి. ఇటీవల వీటి విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. పశ్చిమబంగా, ఒడిశా రాష్ట్రాల నుంచి వీటిని రహస్యంగా దిగుమతి చేసుకుంటున్నారు. దువ్వాడ సమీపంలో గురువారం కొరియర్ ద్వారా దిగుమతి అయిన మత్తును కలిగించే సుమారు 1500 నిషేధిత ఇంజక్షన్లను నిందితుడు మహేశ్వరరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబంగాకు చెందిన కమల్ గోళ్ల రంగు పేరిట వీటిని విశాఖకు కొరియర్ ద్వారా పంపించినట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్వరరెడ్డిపై గతంలో రాజమహేంద్రవరం, విశాఖ టూ టౌన్, కంచరపాలెం పోలీసుస్టేషన్లలో ఈ తరహా ఇంజక్షన్ల విక్రయాలపై కేసులు నమోదయ్యాయి.
అలాగే నగరంలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ గంజాయి రవాణాపై 55 దాడులు నిర్వహించామని.. దిశ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. 120 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 932 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.