ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిషాలో హైదరాబాద్.. పర్యాటక కేంద్రాలే యువత స్పాట్ - drugs sales in Hyderabad

‘ఏరా.. స్కోర్‌ చేద్దామా.. నెక్లెస్‌రోడ్‌లో కలుద్దాం.. వచ్చేప్పుడు స్టఫ్‌ తీసుకురా.. వీడ్‌ లైట్‌ ప్రయత్నించు, వీలు కాకపోతే గ్రీన్‌.. కొత్త బ్రాండ్‌ ఇంకేదైనా ఉంటే చూడు..’ ఇవేం పదాలు.. ఇదెక్కడి భాష అనుకుంటున్నారా..? వినడానికి సాధారణంగానే ఉన్నా ఈ భాష వెనక బతుకుల్ని నిలువునా కూల్చేసే ఓ మహమ్మారి.. ఎందరినో మత్తులో ముంచి సొమ్ము చేసుకుంటున్న ముఠాల దందాలున్నాయి.

Drug dealing in Hyderabad, drug mafia in Hyderabad, drug dealing in Hyderabad
హైదరాబాద్​లో మత్తు దందా, హైదరాబాద్​లో డ్రగ్స్ మాఫియా, హైదరాబాద్​లో డ్రగ్స్ దందా
author img

By

Published : Jun 26, 2021, 9:39 AM IST

అన్ని విషయాల్లో ఇతర మెట్రో నగరాలతో పోటీ పడే హైదరాబాద్‌ డ్రగ్స్‌ సంస్కృతిలోనూ వాటి సరసనే నిలుస్తోంది. పారిశ్రామికవాడలు, శివారు ప్రాంతాలు దాటి ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న పర్యాటక ప్రాంతాలూ కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యార్థులు, మైనర్లు పెడ్లర్లుగా మారి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల్ని తరలిస్తున్నారు. తరచూ పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నా.. కేసులు నమోదు చేస్తున్నా బాహాటంగానే దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఎప్పటికప్పుడు కొత్త సరకు!

నగరంలో సాగుతోన్న ఈ నల్ల మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త సరకు కోసం వెంపర్లాడుతున్నారు మత్తుబాబులు. చెట్ల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కొటిక్‌ ఉత్పత్తులు, ల్యాబుల్లో తయారయ్యే ఉత్పత్తులు, గంజాయి, నల్లమందు, కొకైన్‌లతోపాటు గంజాయితో తయారు చేసే చెరస్, హషీష్‌ ఆయిల్, బంగ్, నల్లమందుతో చేసే బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌.. ఇవన్నీ నార్కొటిక్స్‌ కిందకే వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్‌ లాంటివి సైకోట్రోపిక్స్‌ కిందికి వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో గంజాయి ప్రతి గల్లీలో, నగర శివారుల్లో, పర్యాటక కేంద్రాల్లో గుప్పుమంటోంది.

  • బంగ్‌ ఒక్కో మాత్ర రూ.100, బ్రౌన్‌ షుగర్‌ గ్రాము రూ.15 వేలకు అమ్ముతున్నారు.
  • వీటి ధరలు సాధారణ రోజుల్లో ఇలా ఉండగా లాక్‌డౌన్‌ కాలంలో మత్తుబాబుల బలహీనతను సొమ్ము చేసుకున్నారు వ్యాపారులు. గ్రాము కొకైన్‌ విలువ రూ.5 వేల-రూ.15 వేలకు పెంచి అమ్మారంటే దందా ఎంత పెద్దఎత్తున సాగిందో ఊహించుకోవచ్చు.
  • 2019లో 215 మంది పట్టుబడగా వీరిలో 214 మంది స్థానికులు, ఓ విదేశీయుడు ఉన్నారు.
  • 2020లో 213 మంది పట్టుబడగా వీరిలో 212 మంది స్థానికులు, ఓ విదేశీయుడు ఉన్నారు.

బస్తీలనూ ఆగం చేస్తోంది!

ఒకప్పుడు మాదకద్రవ్యాల ముఠాలకు చిరునామాగా ఉండే ఉన్నతస్థాయి ప్రాంతాల నుంచి బస్తీలకు ఇది సోకింది. గోల్కొండ లక్ష్మీనగర్, దూల్‌పేట, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో కొన్ని ప్రాంతాలు, ఎక్కువ వసతి గృహాలుండే అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాలతోపాటు ముషీరాబాద్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌లకూ విస్తరించింది. బస్తీల్లో మైనర్లను వాడుకుంటూ గంజాయిని చేరవేస్తున్నారు. బస్తీల్లో కత్తులు, రాడ్లతో గొడవలకు దిగుతున్న ఘటనలూ కనిపిస్తున్నాయి.

చింతల్, సూరారం కాలనీ, దుండిగల్‌ ప్రాంతాల్లో ఈ గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. మొన్నటి కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్థానిక కార్పొరేటర్‌ ఒకరు ఎన్నికల్లో గెలిస్తే గంజాయి కట్టడి చేస్తానని ప్రధాన హామీ ఇవ్వడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చెబుతోంది.

పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌రోడ్డు)లో రైల్వే లైనును ఆనుకొని 24 గంటలు గంజాయి గుప్పుమంటోంది. బాహాటంగానే గంజాయి కొడుతూ వచ్చిపోయే పర్యాటకుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆకతాయిలు. బీఎస్‌మక్తా, ఎంఎస్‌మక్తా ప్రాంతాలకు చెందిన కొందరు మైనర్లు దీనికి పెడ్లర్లుగా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details