ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా గంజాయి, శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వివిధ రకాల మత్తుమందులు రాజధానికి చేరుతున్నాయి. వీటిని నిరోధించే బాధ్యత ఎక్సైజ్ శాఖదంటూ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదు. ఎక్కడినుంచైనా సమాచారం అందితే ప్రత్యేక పోలీసు విభాగాలు దాడులు చేయడం తప్పా... పూర్తిస్థాయి నిఘా ఉండటం లేదు. ఇది వ్యాపారులకు వరంగా మారింది. విశాఖ నుంచి తెచ్చిన దీన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో తూతూమంత్రంగా దాడులు చేసి వదిలేస్తున్నారు. కళాశాలల దగ్గర కొకైన్ లాంటి అనేక రకాల మత్తుమందుల విక్రయాలు జరుగుతుంటే పోలీసులు దృష్టిసారించడం లేదు. ఎక్కడైనా దొరికినా రెండుమూడు రోజులు హడావుడి చేస్తూ తర్వాత మర్చిపోతున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పొందుతున్నారు. దీనివల్లే అనేకమంది నేరాలు చేయగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
సెల్ వాడకపోతే నిందితున్ని పట్టుకోలేరా!
చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు సెల్ఫోన్ వాడడని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఘటన జరిగిన ఆరు రోజులైనా నిందితుడిని పట్టుకోలేకపోయాయమని చెబుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే సెల్ఫోన్ వాడకపోతే నిందితులను అరెస్టు చేయడం సాధ్యం కాదా అంటూ అనేకమంది పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఠాణాల పరిధిలో కాలనీల వారీగా పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే ఎటువంటి నేరం చేసిన నిందితులైనా కూడా సులభంగా పట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
సైదాబాద్ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీల వారీగా నిఘా పెట్టాం. మద్యం అలవాటు ఉండటంతో అన్ని దుకాణాల దగ్గర నిఘాను ఏర్పాటు చేశాం. అతణ్ని అరెస్టు చేసి తీరుతాం. భవిష్యత్తులో ఇంటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.