Head found without body: ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్న జైహింద్ నాయక్... ఏడాదిన్నర క్రితమే మతిస్తిమితం కోల్పోయాడు. తుర్కయాంజల్లోని ఓ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ ప్రాంతంలో భిక్షాటన చేసేవాళ్లు, ఇతర వ్యక్తులను పోలీసులు విచారించగా... సదరు వ్యక్తి వారం నుంచి కనిపించడం లేదని వారు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ నెల 2 నుంచి జైహింద్ తుర్కయాంజల్లో లేరని, అతడితో పాటూ ఉంటున్న మరో వ్యక్తితో కలిసి... ఓ వాహనంలో వెళ్లినట్లు పోలీసులకు చెప్పారని సమాచారం. దీని ప్రకారం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు, హైదరాబాద్- సాగర్ రహదారిపై ఉన్న దుకాణాల యజమానులు, ఇతర ఆధారాలతో కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ హత్య సోమవారం ఉదయమే వెలుగులోకి వచ్చినా ఇప్పటివరకు మృతుడి మొండెం దొరక్కపోవడంతో... ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, చింతపల్లి, దేవరకొండ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి.
గుప్త నిధుల కోసమే.?
గతంలోనూ దేవరకొండ, నాంపల్లి, చింతపల్లి మండలాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో... పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తుర్కయంజాల్కు వెళ్లి జైహింద్నాయక్ను ఇంటికి రమ్మని బతిమాలగా.. రానని చెప్పినట్లు మృతుడి తండ్రి తెలిపాడు. గుప్త నిధుల కోసమే తన కుమారుడిని హత్య చేశారని ఆయన అనుమానించారు.
నా దారి నాది.. మీ దారి మీది
'ఏడాదిన్నర క్రితం మా అబ్బాయి మతిస్తిమితం కోల్పోయాడు. మా చెల్లి కొడుకు ద్వారా తుర్కయాంజల్లో ఉంటున్నట్లు తెలిసింది. దీంతో నాలుగైదు సార్లు వెళ్లి ఇంటికి రమ్మని బతిమిలాడాం. రాలేదు. ఆరు నెలల క్రితం మా బిడ్డ పెళ్లి ఉండటంతో ఇంటికి రమ్మని మరోసారి కోరాం. అయినా మేం ఎవరో తెలియనట్లే ప్రవర్తించాడు. నేనిక్కడే ఉంటా.. నా దారి నాది.. మీ దారి మీది.. ఇంటికి రాను అన్నాడు. చివరగా మూడు నెలల క్రితం చూశాం. మా అబ్బాయి ఆరడుగుల ఎత్తు ఉంటాడు, పెళ్లి కాలేదు. ఆదివారం హత్యకు గురికావడంతో గుప్త నిధుల కోసమే మా కుమారుడిని చంపినట్లు మేం అనుమానిస్తున్నాం.' -శంకర్నాయక్, మృతుడి తండ్రి