తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఫోన్‌ వాడొద్దు బిడ్డా అన్నందుకు... బాలిక ఆత్మహత్య! - crime news in medchal district

క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం ఆ బాలిక నిండు జీవితాన్ని బలితీసుకుంది. సెల్‌ఫోన్‌ అతిగా వినియోగిస్తున్నావని తల్లి మందలించడాన్ని అవమానంగా భావించింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Suscide Case in medchal district
Suscide Case in medchal district

By

Published : Jun 19, 2021, 10:02 PM IST

Updated : Jun 20, 2021, 7:40 AM IST

లాక్‌డౌన్‌ వల్ల ఇంటి వద్ద ఉంటున్న బాలిక(16) చరవాణికి బానిసైంది. అర్ధరాత్రి తల్లితో గొడవ పెట్టుకుంది.. తెల్లవారుజామున రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు పరిశీలించి.. ఆత్మహత్యగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు వివరాల ప్రకారం..

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన దంపతులు పదేళ్ల క్రితం ఘట్‌కేసర్‌ మండలం రాజీవ్‌గృహకల్ప కాలనీలో అద్దెకుంటున్నారు. బాలిక తండ్రి హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. బాలిక నారాయణపేట జిల్లా సంగబండలోని ప్రభుత్వ బాలిక గురుకుల పాఠశాలలో పదో తరగతి పాసైంది. లాక్‌డౌన్‌తో రాజీవ్‌గృహకల్ప కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నిత్యం చరవాణిలో ఆటలతో పాటు స్నేహితులతో మాట్లాడేది. పలుమార్లు తల్లి మందలించేది.

ఈనెల 16న తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం సొంతూరుకు వెళ్లారు. ఇంట్లో బాలిక తల్లి, తమ్ముడితో కలిసి ఉంది. శుక్రవారం రాత్రి చరవాణిలో మాట్లాడుతుండగా తల్లి కోప్పడింది. తల్లి, కుమార్తెలు గొడవ పడి, నిద్ర పోయారు. రాత్రి 11.17 గంటల(సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు అయ్యాయి) ప్రాంతంలో ఇంట్లో నుంచి కిరోసిన్‌ సీసాతో బయటకొచ్చి ఇంటి తలుపులకు గడియ పెట్టింది. సుమారు కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్లింది. ఘట్‌కేసర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో ఉన్న ఓఆర్‌ఆర్‌ పక్కన ఖాళీ ప్రదేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకుంది.

ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు షీ బృందం డీసీపీ సలీమా, అదనపు సీఐలు కె.జంగయ్య, విజయబాబు పరిశీలించారు. తల్లి మందలించడంతోనే మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పంపించామని, పరీక్షలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

వెలుగులోకి వచ్చిందిలా..

మధ్య రాత్రి 2 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన తల్లికి కుమార్తె కనిపించకపోవడం, తలుపు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురైంది. బాలికకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి గడియ తీశారు. చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం 7:30గంటల ప్రాంతంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక చరవాణికి తండ్రి ఫోన్‌ చేయడంతో పోలీసులు తల్లిదండ్రులను ఘటనా స్థలికి రప్పించారు.

కుటుంబీకుల అనుమానాలు

బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తాత ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకెళ్లి ఖాళీ స్థలంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకునే ధైర్యం తన మనవరాలికి లేదన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. కుటుంబీకులు రోదించిన తీరు కలిచివేసింది.

ఇదీ చదవండి:హైదరాబాద్‌ శివారులో దారుణం... అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Last Updated : Jun 20, 2021, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details