తెలంగాణ

telangana

ETV Bharat / crime

స్కెచ్ వేసి కిడ్నాప్.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ - medchal district crime news

ఘట్కేసర్ ఫార్మిసీ విద్యార్థిని కిడ్నాప్​ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థినిని అపహరించి, సామూహిక అత్యాచారం చేశారని రాచకొండ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒంటరిగా వెళ్లే అమ్మాయిలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడేవారని చెప్పారు.

telangana crime news
స్కెచ్ వేసి కిడ్నాప్.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్

By

Published : Feb 12, 2021, 8:14 AM IST

Updated : Feb 12, 2021, 11:04 AM IST

పథకం ప్రకారమే కిడ్నాప్, అత్యాచారం

ముందుగా అనుకున్న పథకం ప్రకారమే నిందితులు ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్యచేయాలనీ భావించారు. పోలీసు వాహనాల సైరన్లు నలువైపులా మోగుతుండటంతో వెనకడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి అఘాయిత్యాలకు పాల్పడేవారని, మరికొందర్నీ అత్యాచారం చేశారని విచారణలో తేలినట్టు తెలిసింది. కేసు వివరాలను రాచకొండ పోలీసులు శుక్రవారం అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

ఎప్పట్నుంచో కన్ను

బాధిత విద్యార్థిని (19) మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగుతున్న యువతి అక్కణ్నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న ఆర్‌ఎల్‌నగర్‌లోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ప్రధాన నిందితుడు తన సెవెన్‌ సీటర్‌ ప్యాసింజర్‌ ఆటోను రాంపల్లి చౌరస్తా దగ్గరున్న అడ్డాలో నిలిపి ఉంచడంతో కొన్నిసార్లు ఆ ఆటోలోనూ ప్రయాణించింది. ఆ క్రమంలోనే అతడి కన్ను ఆమెపై పడింది. సహచరులైన మరో ముగ్గురు ఆటో డ్రైవర్లకు ఆమె గురించి చెప్పిన అతను, అదనుచూసి కిడ్నాప్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.

‘మ్యాటర్‌ రెడీ’గా ఉంది అంటూ..

ఎప్పటిలాగే యువతి బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య రాంపల్లి చౌరస్తా దగ్గర కళాశాల బస్సు దిగి ఆటో అడ్డా వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు, ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేసి ‘మ్యాటర్‌ రెడీగా ఉందంటూ’ సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు మహిళలు, యువకుడు ఉండటంతో ఆమె యథావిధిగా అందులో ఎక్కింది. చౌరస్తా నుంచి కి.మీ. దూరంలో ఉన్న సత్యనారాయణ కాలనీ దగ్గర ఇద్దరు, ఆ తర్వాత కొంతదూరంలో మరొకరు దిగారు. ఇంకొంచెం దూరంలో యువతి దిగాల్సిన ఆర్‌ఎల్‌నగర్‌ బస్‌స్టాప్‌ ఉంది. నిందితుడు ఆటోను అక్కడ ఆపకుండా వేగంగా యంనంపేటవైపు పోనిచ్చాడు. అనుమానించిన యువతి ‘ఆటోను మన స్టాప్‌లో ఆపకుండా డ్రైవర్‌ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నాకు భయమేస్తోందంటూ’ తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె బంధువులకు విషయం చెప్పగా, వాళ్లు డయల్‌ 100కు సాయంత్రం 6.30 గంటల సమయంలో ఫోన్‌ చేశారు.

ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయంతో..

ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి వెనుక సీట్లో యువతికి చెరోవైపు కూర్చున్నారు. మరోవ్యక్తి ఘట్‌కేసర్‌ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ యువతిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు. అందులోనే అందరూ అత్యాచారం చేశారు. అదే సమయంలో పోలీస్‌ వాహనాల సైరన్‌ మోగడం, ‘ఆటోలో అమ్మాయిని కిడ్నాప్‌ చేశారు..ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ’ పోలీసులు మైకుల్లో ప్రకటిస్తుండటాన్ని విన్న నిందితులు దొరికితే ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడ్డారు. యువతిని వ్యాన్‌ నుంచి కిందకు దించి పక్కనే పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడను గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తదుపరి వైద్యపరీక్షల నిమిత్తం గురువారం నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలా చిక్కారంటే...

రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలోనే బాధితురాలితోపాటు మరో యువకుడు ఆటోలో ఎక్కినట్లు గుర్తించి విచారించారు. అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా అడ్డాలోని ఆటో డ్రైవర్లను ఆరాతీశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నలుగుర్ని గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తును రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాంపల్లి ఆర్‌ఎల్‌నగర్‌, ఓయూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.

మరో అయిదుగురిపైనా అఘాయిత్యం

నిందితులకు సంబంధించిన నేర చరిత్రపై పోలీసులు ఆరా తీయగా పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ‘వీళ్లు ఒంటరిగా కళాశాలకు/ఉద్యోగాలకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకునేవాళ్లు. 15 రోజులు గమనించిన తర్వాత ప్రధాన నిందితుడు అదునుచూసి ఆటోలో ఎక్కించుకునేవాడు. ప్రయాణికులు దిగిపోగానే మరో ఇద్దరు స్నేహితుల్ని ఎక్కించుకుని బాధితురాలితో సహా ఉడాయిస్తాడు. మరో స్నేహితుడు ఘట్‌కేసర్‌కు సమీపంలోని ఓఆర్‌ఆర్‌ దగ్గర వ్యాన్‌తో వేచి ఉంటాడు. సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని బెదిరించి సామూహికంగా అత్యాచారానికి పాల్పడేవారు. ఎదురు తిరిగితే విచక్షణారహితంగా కొట్టి అఘాయిత్యం చేసేవారు. మరో నలుగురిపై ఇలాగే అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిసింది.

Last Updated : Feb 12, 2021, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details