Murder attempt on Daughter in Law: భర్త చనిపోయి ముగ్గురు పిల్లలతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలిపై కన్నేశాడు ఓ కీచక మామ. ఎలాగైనా పెళ్లి చేసుకుని శారీరక వాంఛ తీర్చుకోవాలని చూశాడు. చివరికి ప్రయత్నం బెడిసికొట్టి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరయ్య.. తన కుమారుడికి సొంత చెల్లెలు కూతురుతో వివాహం జరిపించాడు. వారికి ముగ్గురు సంతానం. మూడేళ్ల క్రితం కుమారుడు డెంగ్యూతో మృతి చెందాడు. దీంతో కోడలు, పిల్లలు ఒంటరిగా మిగిలారు. దీనిని ఆసరాగా చేసుకున్న మామ.. కోడలిని లొంగదీసుకోవాలని చూశాడు. అందుకే పుట్టింటికి సైతం వెళ్లనీయకుండా.. కన్న కూతురిలా చూసుకుంటానంటూ నమ్మించాడు. అప్పటికీ బాధితురాలి తల్లి వారించినా.. 'మీకే తిండికి గతి లేదు.. మీరెలా చూసుకుంటారు' అంటూ దయాగుణం ప్రకటించి.. కోడలు పుట్టింటికి వెళ్లకుండా అడ్డుపడ్డాడు.
అత్త కూడా వంతపాడింది
మొదటి ఏడాది బాగానే చూసుకున్నా.. ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించాడు. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సింది పోయి.. సమయం చూసి తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన తెచ్చాడు. ఈ విషయం విని అవాక్కయిన బాధితురాలు.. అత్తను తల్లిలా భావించి జరిగిన సంగతి చెప్పింది. కోడలిని కూతురులా భావించి మంచీ చెడు చూసుకోవాల్సిన అత్త సైతం.. ఆ దుర్మార్గుడికే వంత పాడింది. తన భర్తను పెళ్లి చేసుకోమని చెప్పింది. వారి అభిప్రాయాన్ని భర్త తోబుట్టువులు సైతం సమర్థించారు. వారి మనసులోని దురాలోచనను బయటపెట్టేసరికి తట్టుకోలేని కోడలు.. వారితో వాదనకు దిగింది. బాగా చూసుకుంటామని చెప్పి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించింది.