తెలంగాణ

telangana

ETV Bharat / crime

EX Sarpanch Ramesh Murder: ఇన్‌ఫార్మార్ల గుండెల్లో గుబులు రేపుతున్న మాజీ సర్పంచ్ హత్య

EX Sarpanch killed by Maoists: ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్‌ను అపహరించి… మావోయిస్టులు హత్యచేయడం కలకలం రేపుతోంది. చాలా రోజుల తర్వాత… ఈ ప్రాంతంలో జరిగిన ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా మావోయిస్టులు ఇచ్చిన హెచ్చరికలు ఇన్‌ఫార్మార్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

By

Published : Dec 23, 2021, 6:42 AM IST

EX Sarpanch Ramesh Murder, EX Sarpanch Ramesh killed by Maoists
మాజీ సర్పంచ్ హత్య

కలకలం రేపుతున్న మాజీ సర్పంచ్ హత్య

EX Sarpanch Ramesh killed by Maoists: ములుగు జిల్లా వెంకటాపురం మండలం కే. కొండాపురం మాజీ సర్పంచిని మావోయిస్టులు అపహరించి… అనంతరం హత్య చేసిన ఉదంతం… ఏజెన్సీ వాసులను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కిడ్నాప్ చేసి దట్టమైన అటవీ ప్రాంతంలో కళ్లకు గంతలు కట్టి ఏడుగంటలు నడిపించి క్రూరంగా తుపాకితో కాల్చి హతమార్చారు. ఛత్తీస్​గఢ్​పరిధిలోని కొత్తపల్లి వద్ద మృతదేహం వదిలి వెళ్లారు. ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించే వారికి ఇదే దుర్గతి పడుతుందంటూ అక్కడే లేఖ వదిలి వెళ్లారు.

సోమవారం.. చర్లకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రమేశ్​.... ఇంటికి తిరిగి రాలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో... అతని భార్య రజిత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకి హాని తలపెట్టవద్దని...వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన జరిగి 24 గంటలు కాకముందే... ఛత్తీస్​గఢ్ సమీపంలో కొత్తపల్లి గ్రామ అటవీ పరిసరాల్లో రమేశ్​ మృతదేహం ఈ ఉదయం లభ్యమైంది. అంతేకాదు ఏ విధంగా పోలీసులు తనను ఒత్తిడి చేసిందీ.. ఎంత డబ్బులిచ్చారన్నదీ రమేశ్‌ స్వయంగా మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి మావోయిస్టులు విడుదల చేశారు.

రమేష్‌ను మావోయిస్టులు హత్య చేయడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడి మృతదేహంతో గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ శాఖ వ్యవహరించిన తీరు వల్లే రమేశ్​ చనిపోయాడని ఆరోపించారు. ఎస్సై తిరుపతి ఘటనాస్థలానికి రావాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు వాడుకుని వదిలేశారని.. తన భర్త మృతికి న్యాయం చేయాలని మృతుడి భార్య పేర్కొన్నారు.

''నా తరఫున ఎవరు పోరాడతారు. పోలీసులు డ్యూటీ చేయరా? అవసరమున్నప్పుడు వాడుకున్నారు నా భర్తని. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడిగారు. పోలీసులు కాల్​లిస్టు మొత్తం తీయాలి. నాకొక క్లారిటీ రావాలి. నా భర్తని ఎవరు చంపారో నాకు తెలియాలి. నా భర్త ఒకరికి అన్యాయం చేసినవాడు కాదు. ఈ ఊరు చుట్టుపక్కల అంతా ఎంక్వైరి చేయండి. పోలీసులకు తెల్వదా నా భర్త ఎలాంటి వాడో.''

రజిత, మృతుడి భార్య

ప్రశాంతంగా ఉన్న మన్యంలో తాజా ఘటన పోలీసులకు సవాల్ విసిరింది. ఇన్‌ఫార్మర్ల వ్యవస్ధపైన కన్నేసిన మావోయిస్టులు.. పక్కా పథకంతో రమేశ్‌ను హతమార్చారు. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా… ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏడాది క్రితం తెరాస కార్యకర్త భీమేశ్వరరావు హత్య తర్వాత చిన్నచిన్న ఘటనలకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఇప్పుడు రమేశ్‌ హత్యతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం మన్యం వాసులను వెంటాడుతోంది. తమ ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన ఇన్‌ఫార్మర్ల వ్యవస్ధపైన మావోయిస్టులు కన్నేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి:maoists killed suraveedu ex sarpanch : మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హత్య

ABOUT THE AUTHOR

...view details