తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 10:00 AM IST

ETV Bharat / crime

వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్​కు బదులు రసాయనాలు

కరోనా సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం చెబుతోంది. అప్రమత్తమైన ప్రజలు వీటిని వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా వాటికి డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు.. ఆల్కాహాల్​కు బదులుగా రంగునీళ్లు, విషపూరిత రసాయనాలతో శానిటైజర్ తయారు చేసి ప్రజలను దోచుకుంటున్నారు.

duplicate sanitizers, aultrated sanitizers
నకిలీ శానిటైజర్లు, కల్తీ శానిటైజర్లు, శానిటైజర్ల దందా

కరోనా వైరస్‌ దరి చేరకుండా మాస్కులతోపాటు వినియోగిస్తున్న శానిటైజర్ల మార్కెట్‌పై కొందరు అక్రమార్కులు కన్నేశారు. నకిలీ శానిటైజర్లను వేల లీటర్లలో తయారు చేసి హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ఇవే బ్రాండెడ్‌ శానిటైజర్లంటూ విక్రయిస్తున్నారు. రాజధాని కేంద్రంగా కొనసాగుతున్న ఈ నకిలీ దోపిడీ మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని మధుబన్‌ కాలనీలో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న ఓ ముఠాను శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం అరెస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరివద్ద నుంచి 1,300 లీటర్ల నకిలీ శానిటైజర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లీటర్‌ రూ.150 నుంచి రూ.200

నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్న తయారు చేస్తున్నవారు ఇథైల్‌ ఆల్కహాల్‌ బదులుగా మిథైల్‌ ఆల్కహాల్‌, ఫైపాలాప్స్‌, రంగునీళ్లు, పరిమళ ద్రవ్యాలు కలుపుతున్నారు. బ్రాండెడ్‌ శానిటైజర్‌ లీటర్‌ ధర హోల్‌సేల్‌లో రూ.500లు ఉండగా, నిందితులు లీటర్‌ రూ.150ల నుంచి రూ.200లకు హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వేగంగా విక్రయాలు జరిగే మార్కెట్లను ఎంచుకుని ఐదు లీటర్ల క్యాన్లలో ఇస్తున్నారు. వాటిపై ముంబయికి చెందిన కంపెనీల బ్రాండ్లను ముద్రిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అమీర్‌పేట, బాలానగర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు వెళ్లి క్యాన్లను విక్రయిస్తున్నారు. అటు హోల్‌సేల్‌ వ్యాపారులు, ఇటు నిందితులు రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. నెలకు రూ.కోట్లలోనే టర్నోవర్‌ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మూతపడ్డ పరిశ్రమల్లో ..

జీడిమెట్ల, బాలానగర్‌, చర్లపల్లి, ఐడీఏ బొల్లారంలోని పారిశ్రామికవాడల్లో మూతపడ్డ పరిశ్రమల్లో వీటిని తయారు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆల్కహాల్‌ లేకుండా కొన్ని రసాయన మిశ్రమాలను కలిపి గతేడాది కరోనా వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరినప్పుడు నిందితులు విక్రయించారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ముడి సరకులు మార్కెట్‌లో సులభంగా లభిస్తుండడంతో అక్రమార్కులు వీటి తయారీపై మొగ్గుచూపుతున్నారు. శానిటైజర్ల తయారీకి లైసెన్స్‌ ఉందంటూ వ్యక్తులు, సంస్థల పేర్లను వినియోగించుకుంటున్నారు. సైబరాబాద్‌ పరిధిలో వీటి తయారీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. వీటి తయారీ వ్యవహారంపై సమాచారాన్ని తమకు తెలపాలని నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ సూచించారు.

చర్మవ్యాధులు, ఇతర సమస్యలు

నకిలీ శానిటైజర్లు వినియోగించడం కారణంగా చర్మవ్యాధులు, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇథైల్‌ ఆల్కాహాల్‌, ఇథానాల్‌ వంటివి 62 శాతం నుంచి 90 శాతం శానిటైజర్‌లో ఉండాలి. అక్రమార్కులు ప్రమాదకరమైన, విషపూరిత రసాయనాలు వాడడం కారణంగా చేతులకే కాదు, రోగ నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. శానిటైజర్‌ చేతులకు పూసుకొని సరిగ్గా కడుక్కోకపోతే వాటి అవశేషాలు కడుపులోకి వెళ్లి ఆల్కహాల్‌ విషతుల్యం అయ్యే ఆస్కారం ఉంది. కొందరికి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే బ్రాండెడ్‌ శానిటైజర్లను వినియోగించడం శ్రేయస్కరం.

- డాక్టర్‌ సూరపనేని శైలజ, చర్మవాధి నిపుణులు

ABOUT THE AUTHOR

...view details