సులభంగా రుణాలిస్తామంటూ రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రుణాల యాప్లను షాంఘైలో రూపొందించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సంబంధిత ఆధారాలను చైనీయుడు ల్యాంబో నుంచి సేకరించారు. తెలుగురాష్ట్రాలు, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో చిరువ్యాపారులు, యువతను ఆకర్షించి రూ.లక్షల్లో రుణాలిచ్చి.. గడువులోపు చెల్లించినా.. బెదిరించి 60శాతం వడ్డీ వసూలు చేశారని తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసినా చైనీయులను అరెస్టు చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రుణాల యాప్ల కేసుల్లో ఇప్పటి వరకు రూ.400కోట్లు స్తంభింపజేసిన పోలీసులు మరిన్ని ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు.
రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు.
యాప్ల ద్వారా రుణాలిచ్చేందుకు యత్నించిన చైనా కంపెనీలకు తొలుత ఆశించిన ఫలితాలు రాలేదు. లాక్డౌన్ ప్రభావం ప్రైవేటు ఉద్యోగుల జీతాలపై పడటంతో చైనా కంపెనీల పంటపండింది. ఎలాంటి పత్రాలు, వ్యక్తిగతపూచీ లేకుండా రుణాలిస్తామంటూ వాట్సాప్ ద్వారా లింకులు పంపుతుండడంతో లక్షలమంది ముందుకొచ్చారు. ఒక్కోరోజు గరిష్ఠంగా రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే రూ.16వేలకోట్ల లావాదేవీలు నిర్వహించారు. ఇందులో సింహభాగం లావాదేవీలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
మహా పన్నాగం..
రుణాల యాప్లను రూపొందించి భారత్లో కంపెనీలు ప్రారంభించాలని ఎనిమిది మంది చైనీయులు అక్టోబరు, 2019లో నిర్ణయించారు. ఓ ప్రైవేటు కంపెనీలో కన్సల్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జెన్నీఫర్, మరో కంపెనీలో ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న వాంగ్ జియాంగ్ షి కలిసి నవంబరులో దిల్లీకి వచ్చారు. మరో చైనీయుడిని రప్పించి వేర్వేరుగా మూడు సంస్థలను నవంబరులో ప్రారంభించారు. జెన్నీఫర్ దిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో కాల్సెంటర్లు ఏర్పాటు చేయగా.. జియాంగ్ షి బెంగళూరుకు పరిమితమయ్యాడు. కంపెనీలు ప్రారంభించాక జెన్నీఫర్తో పాటు వచ్చిన చైనీయుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో ఐదుగురు చైనీయులు వచ్చి కొద్దిరోజులు కార్యకలాపాలు పర్యవేక్షించారు. గతేడాది జనవరిలో షాంఘైలో ఉంటున్న ల్యాంబోను జెన్నీఫర్ పిలిపించింది. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కాల్సెంటర్ల బాధ్యత అప్పగించి, ఆమె జకర్తాకు వెళ్లిపోయింది. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసుల పరిశోధనలో తాజాగా వర్జిన్ ఐలాండ్స్లోని బ్యాంకుల్లో చైనీయులు బినామీ ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి రూ.వందల కోట్లు షాంఘైకి బదిలీ అయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు.