Student Attack: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఫరూఖ్నగర్లో మతిస్థిమితంలేని 70 ఏళ్ల వృద్ధ యాచకురాలిపై డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు. బుధవారం(ఫిబ్రవరి 9న) సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. కాసేపటి తర్వాత వృద్ధురాలి ఒంటిపై ఉన్న గాయాలను చూసి స్థానికులు ఆరా తీశారు. ఎవరికీ తెలియదనటంతో.. అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ దృశ్యాల్లో ఆ యువకుడి పైశాచికత్వం బయటపడింది.
గొరగొరా ఈడ్చుకెళ్తూ..
70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు సిద్దమ్మ.. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో చాలా కాలంగా ఉంటోంది. యాచిస్తూ జీవనం కొనసాగిస్తోంది. అదే పరిసరాల్లో ఉంటున్న యువకుడు పర్వేజ్.. డిగ్రీ చదువుతున్నాడు. "ఎప్పటిలాగే రోడ్డు పక్కన వృద్ధురాలు కూర్చొని ఉంది. అప్పటి వరకు కొంత దూరంలో నిల్చొని ఉన్న యువకుడు.. ఒక్కఉదూటున వృద్ధురాలి వద్దకు వచ్చాడు. అచేతనంగా ఉన్న ఆమెను కొట్టటం ప్రారంభించాడు. విచక్షణారహితంగా కొట్టుకుంటూనే.. ఆ బక్కప్రాణాన్ని రోడ్డుపై గొరగొరా ఈడ్చుకుంటూ వెళ్లాడు." ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.