తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2021, 1:27 PM IST

ETV Bharat / crime

CYBER CRIME: ''మీకు కరోనా వచ్చిందా..? అయితే రూ.50 వేలు వస్తాయి''

''మీకు కొవిడ్​ వచ్చింది కదా... అయితే మీకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్​ భత్యం ఇస్తుంది. ఈ లింక్​ను క్లిక్​ చేసి వివరాలు నమోదు చేసిన వెంటనే మీ ఎకౌంట్​లో రూ. 50వేలు క్రెడిట్​ అవుతాయి'' అంటూ... సైబర్​ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీశారు.

CYBER CRIME
CYBER CRIME

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కొవిడ్‌ భత్యం పేరుతో సరికొత్త మోసాలకు తెరతీశారు సైబర్‌ నేరస్థులు. కరోనా వైరస్‌ బాధితులకు రూ.50 వేలు ఇస్తున్నామంటూ సెల్‌ఫోన్లకు లింకులు పంపుతున్నారు. దానిపై క్లిక్‌ చేస్తే.. మీ ఇంట్లో ఎవరికైనా కొవిడ్‌ సోకిందా? వంటి ప్రశ్నలు అడిగి ఖాళీలు పూరించమంటారు. అనంతరం మీరు రూ.50 వేలు పొందేందుకు అర్హత సాధించారని, అలవెన్స్‌ మరింత మందికి లభించేందుకు 25 మంది ఫోన్‌ నంబర్లు పంపించాలని సూచిస్తారు.

ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యాక డబ్బు పంపుతాం.. మీ ఖాతా నంబర్లు ఇవ్వండని అడుగుతారు. ఆ వివరాలు చెబితే.. ఓటీపీలు చెప్పమంటారు. అనంతరం ఖాతాల్లోని నగదుని బదిలీ చేసుకుంటారు. ఆ లింక్‌లో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ చిహ్నాన్నీ వినియోగిస్తుండడం గమనార్హం. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌ గ్రూప్‌లలో వస్తున్న ఈ ప్రకటనలపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీశారు. ఈ ప్రకటనతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధం లేదని నిర్ధారించుకున్నాక బుధవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ ప్రకటనల్లో సాంకేతిక అంశాలను పరిశీలించామని, వీటిని చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయని, దిల్లీలో ఉంటున్న నేరస్థులు వాట్సాప్‌ లింక్‌లను పంపుతున్నారని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. కరోనా అలవెన్స్‌ పేరుతో వస్తున్న లింక్‌లను క్లిక్‌ చేయవద్దని సూచించారు.

ఇదీ చూడండి:Saidabad Incident: మరో 20 లక్షలిచ్చినా.. అవసరం లేదు: బాలిక తండ్రి

ABOUT THE AUTHOR

...view details