కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని కూడా సైబర్ నేరగాళ్లు(Cybercriminals) వదలడం లేదు. అత్యవసర ఔషధాలు మొదలుకుని ఎండు ఫలాలు(dry fruits) తక్కువ ధరలకే విక్రయిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తూ... ముందుగా డబ్బు చెల్లిస్తే ఇంటికి తీసుకువచ్చి ఇస్తామంటూ యథేచ్ఛగా మోసాలకు(cyber crime) పాల్పడుతున్నారు. ఇటీవల మోసపోయిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
తక్కువ ధరలకే జీడిపప్పు, బాదం
కరోనా వైరస్ సోకిన వారు మంచి పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ కొవిడ్ విజృంభణతో ఎండు ఫలాల(dry fruits)కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cybercriminals) రంగప్రవేశం చేశారు. తక్కువ ధరలకే జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఖర్జూరం, తృణ ధాన్యాలు, పిస్తా వంటివి... అందిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో(Social media) ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తున్నారు. నేరుగా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామంటూ... అయితే తాము సూచించిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెబుతున్నారు.
అయిదు వేల నుంచి..
నేరగాళ్ల మాటలు నమ్మి కొందరు డబ్బలు జమ చేస్తున్నారు. ఖాతాల్లోకి డబ్బు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు తరచూ సైబర్ క్రైం పోలీసులకు వస్తున్నాయి. అయితే కొందరు అయిదు వేల నుంచి మొదలుకుని రెండు వేలు, వెయ్యి రూపాయలు ఇలా నేరగాళ్లు స్వాహా చేస్తున్నారు. బాధితులు కొందరు తక్కువ మొత్తం పోయిందని ఫిర్యాదులు ఇవ్వడం లేదు. మరికొందరు మాత్రం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు.