Cheating in the name of Chits: హైదరాబాద్ లాంటి మహానగరంలో విభిన్న ప్రాంతాల మనుషులు ఉంటారు. కొత్త వారిని మనం నమ్మకపోయినా.. ఏళ్ల తరబడి మనతో కలిసి ఒకే కాలనీలో ఉంటున్న వారిని ఆత్మీయులుగా భావిస్తాం. ఆ పరిచయాన్నే ఆసరాగా చేసుకుని ఏదో విధంగా మోసం చేసి నమ్మిన వారికి గుండె కోతను మిగులుస్తున్నారు. కూతురు పెళ్లి కోసమనో, ఇల్లు కట్టుకోవచ్చనే ఆశతో పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేయడం ఓ మధ్య తరగతి కుటుంబ లక్షణం. వారి ఆశనే పెట్టుబడిగా పెట్టి రూ.2.5 కోట్లకు పైగా దండుకుని ఉడాయించారు ఈ కిలాడి దంపతులు. వారి ఉచ్చులో చిక్కిన బాధితుల వేదన వర్ణనాతీతం.
రూ. 2.5 కోట్ల మోసం
రాష్ట్రంలో పలు చోట్ల తరచూ 'చిట్టీల పేరుతో మోసాలు' ఘటనలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. నమ్మించి రూ. కోట్లలో బాధితుల నుంచి వసూలు చేసి.. సమయం చూసుకుని ఉడాయించిన ఘటనలు ఎన్నో. తాజాగా హైదరాబాద్ సూరారం కాలనీలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. దాదాపు 100 కు పైగా బాధితుల నుంచి రూ. రెండున్నర కోట్లకు పైగా నగదుతో ఉడాయించారు దంపతులు.
నమ్మించి మోసం
సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణ దుకాణం నిర్వహిస్తున్న దంపతులు.. మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తమ వద్ద చిట్టీలు వేసిన వారికి ఎప్పటికప్పుడు వారు అడిగిన వెంటనే నగదు సమకూర్చేవారు. దీంతో వారిని నమ్మి స్థానికులంతా ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. దీంతో భారీ మొత్తం నగదు కూడబెట్టుకుని గత వారం.. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బాధితులు ఫోన్ చేస్తే రేపు మాపు అంటూ సాగదీశారు. ఆ తర్వాత రెండ్రోజులకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. పద్మ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.
బాధలు వర్ణనాతీతం
ఈ దంపతుల బారిన పడి మోసపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. భర్త ఆరోగ్యం బాగోలేక మంచాన పడితే.. ఇంటి ఇల్లాలు ఒక్కరే కష్టపడుతూ కుమార్తె పెళ్లి కోసమని వారి వద్ద చిట్టీ వేశారు. ఆరోగ్య అవసరాల దృష్ట్యా మరొకరు. ఇదే కాకుండా బంగారం అరువు ఇచ్చిన వారితో పాటు.. అప్పులిచ్చిన వారూ ఉన్నారు. మరికొందరు మొదట్లోనే చిట్టీ పాడితే తక్కువ వస్తుందనే ఉద్దేశంతో.. చివరి వరకు ఆగిన వారున్నారు. అసలే మధ్య తరగతి బతుకులు.. ఇలా నమ్మించి మోసం చేస్తే తమ పరిస్థితి ఏం కాను అని రోదిస్తున్నారు.