Cheddi gang Arrest : కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు ముఠాలకు చెందిన ముగ్గురిని పట్టుకున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ తెగకు చెందిన వారు వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకోగలిగారు.
చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్
కృష్ణా, గుంటూరు జిల్లా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో జరిగిన చోరీ ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్ర సాయంతో పోలీసులు దర్యాప్తు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దులోని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దృష్టి పెట్టారు. దొంగలు సెల్ఫోన్లు వాడి ఉంటారా? అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిపారు. ప్రధానంగా విజయవాడ రైల్వేస్టేషనుకు ఈ రెండు రాష్ట్రాల రైళ్లు వచ్చిన సమయాలలో అక్కడి సెల్టవర్ డంప్ను సేకరించారు. ఘటనా స్థలాల్లోని డంప్నూ తీసుకున్నారు. దాదాపు లక్ష కాల్స్ వచ్చాయి.
అనుమానాస్పద నంబర్లు
వీటిని వడపోసి చూస్తే.. రెండు నంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఇవి ఈ ముఠా గుజరాత్ నుంచి బయలుదేరే రోజే యాక్టివేట్ చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ నంబర్ల నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్తున్నాయి? ఎవరెవరు వీటికి చేస్తున్నారు? అన్నది డంప్ విశ్లేషణలో పోలీసులు బయటకు తీశారు. ఈ రెండు నంబర్ల నుంచి గుజరాత్లోని గార్బార్డ్లోని ఓ ఫోన్కు తరచూ కాల్స్ వెళ్లినట్లు తేలింది. ఈ నంబర్లకు సంబంధించి కాల్ డేటా రికార్డ్స్ను తెప్పించి వడపోయడంతో పలు ఆధారాలు దొరికాయి. చెడ్డీ గ్యాంగ్ విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో దొంగతనం చేసి.. గుంటూరు జిల్లా తెనాలి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజుల పాటు అక్కడి రైల్వే స్టేషనులోనే ప్లాట్ఫారాలపై ఉన్నట్లు తెలిపారు. అనంతరం గుంటుపల్లిలో దొంగతనం జరిగిన రోజు మళ్లీ విజయవాడ వచ్చి రైల్వేస్టేషనులోని ప్లాట్ఫారంపై తలదాచుకున్నారు. తాడేపల్లి ప్రాంతాల్లో చేసిన రోజు అక్కడి రైల్వే వంతెన కింద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.