తెలంగాణ

telangana

ETV Bharat / crime

సేవకులు నకిలీ.. సేవకు మకిలి! - charity frauds

కష్టాల్లో ఉన్నామంటే ఆదుకునే చేతులు.. ఆపదలో ఉన్నామని తెలిస్తే పరిగెత్తుకొచ్చే స్వచ్ఛమైన మనుషులు నగరంలో ఎంతోమంది. అనాథలకు అయినోళ్లుగా, అభాగ్యులకు అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలూ ఎన్నో. అయితే ఇప్పుడు ఈ సేవకు నకిలీ సేవకులు మకిలి పట్టిస్తున్నారు. గల్లీకో స్వచ్ఛంద సంస్థ తెరిచి సాయం పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతూ నగరవాసుల మానవత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

charity is opening up and donating money to the humanity of the city dwellers by committing extortion in citys
సేవకులు నకిలీ.. సేవకు మకిలి!

By

Published : Mar 9, 2021, 8:03 AM IST

నగరంలో సాయం పేరిట కేటుగాళ్ల వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్‌ వద్ద జాతీయ రహదారిపై వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో ఉండే ఈ ఆరుగురు మహిళలు రోడ్లపై వచ్చిపోయే వాహనదారుల వద్ద ట్రస్టుల సేవా కార్యక్రమాల పేరిట వసూళ్లకు పాల్పడ్డారు.

గతంలో బోరబండకు చెందిన ఇద్దరు యవకులు ‘హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభాగ్యుల చిత్రాల్ని వాడుతూ పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ఓ పేద మహిళ శస్త్రచికిత్స కోసం పెద్దఎత్తున వచ్చిన విరాళాల ఖర్చుతో వీరి బండారం బయటపడింది. దాతల నుంచి వచ్చిన సొమ్ముని సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలడంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

సగానికిపైగా అనుమతుల్లేవ్..
హైదరాబాద్‌, మేడ్చల్‌ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 500 దాకా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అనాథ, వృద్ధాశ్రమాలున్నాయి. అయితే వీటిలో సగానికిపైగా అనుమతుల్లేనివే. కేవలం సామాజిక మాధ్యమాల వేదికగా నడిచే వాటి సంఖ్య వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ చాలావరకు ఆశ్రమాలు దాతల సహకారం, విదేశీ మిషనరీల నుంచి వచ్చే నిధులతో నడుస్తున్నాయి. వీటి నిర్వాహకులు దాతృత్వం ముసుగులో నెలకు రూ.లక్షల్లో వచ్చే సొమ్ముతో జేబులు నింపుకొంటున్నారు. డబ్బాలు పట్టుకుని కూడళ్లలో డబ్బులు వసూలు చేస్తున్న వారిలో నిజమైనదేదో, నకిలీదేదో తెలియని పరిస్థితి. దీంతో అసలు వ్యక్తులకు సాయం అందట్లేదు.



నాగారం పరిధిలో వృద్ధాశ్రమం పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ గతంలో నిధులు దండుకుని మానసిక వైకల్యం ఉన్నవారందరినీ గొలుసులతో నిర్బంధించింది. మరో వృద్ధాశ్రమంలో 3 గదుల్లో 24 మందిని కుక్కటం, మరో అనాథాశ్రమంలో బాలబాలికల్ని ఒకే గదిలో ఉంచడం.. తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్త్రీశిశు సంక్షేమశాఖ విభాగం నామమాత్రపు తనిఖీలు నిర్వహించింది. 50 దాకా ఆశ్రమాలకు నోటీసులివ్వగా రెండింటిని మాత్రమే మూయించారు.


ప్రభుత్వ ఆశ్రమాలేవీ?
నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది ఒక్కటేనని, అందులో 30 మంది దాకా ఆశ్రయం పొందుతున్నారనేది అధికారులు చెబుతున్న మాట. అయితే అనాథ, వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో దాదాపు 150 మందికి అన్ని సౌకర్యాలతో వసతి కల్పించే ఆశ్రమం ఒకటి లేదా రెండైనా ఉండాలన్నది నిబంధన. మరోవైపు ఎన్జీవోలు నిర్వహిస్తున్న ఆశ్రమాలనూ పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదే. కానీ అలా జరగడం లేదు.

ఇదీ చదవండి:తంజావూరు కళారూపంలో యాదాద్రీశుల పరిణయోత్సవం

ABOUT THE AUTHOR

...view details