తెలంగాణ

telangana

ETV Bharat / crime

Viveka Murder Case : ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ప్రత్యేక దృష్టి - Viveka Murder Case latest news

Erra Gangireddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితుడైన ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. విచారణ వేగవంతం కావాలంటే అతడి బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Erra Gangireddy
Erra Gangireddy

By

Published : Jul 27, 2022, 12:33 PM IST

Erra Gangireddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడైన ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. విచారణ వేగవంతం కావాలంటే అతడి బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు నెలల కిందట ఏపీ హైకోర్టులో బెయిలు రద్దు పిటిషన్‌ వేసినా ఫలితం లేకపోయింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులను చేరుస్తూ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో ఏ-2 సునీల్‌ యాదవ్‌, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-4 డ్రైవర్‌ దస్తగిరి బెయిలుపై ఉన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐకి అనుకూలంగా సాక్ష్యం ఇచ్చాడు. అతడి బెయిలు పిటిషన్‌కు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో గత ఏడాది అక్టోబరులో కడప కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఏ-1 ఎర్ర గంగిరెడ్డిని తప్పనిసరిగా అరెస్టు చేయాలని సీబీఐ వాదిస్తోంది.

వివేకాను హత్య చేయడానికి అతడి ఇంట్లోనే 2019 ఫిబ్రవరి 10న ప్రణాళిక రచించారని చెబుతోంది. తర్వాత నెల రోజులకే వివేకా హత్యకు గురయ్యారు. వివేకాను హత్య చేసేందుకు శివశంకర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నాడని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమ వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారని చెప్పినట్లు వివరించారు.

హత్యకు ముందే రూ.కోటి ముట్టజెప్పారని, కాబట్టే ఈ కుట్రలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర వహించాడని, అతడిని అరెస్టు చేసి విచారించాలని భావిస్తోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు లేకుండా రక్తపు మరకలు తుడిచేలా చేసిన వారిలో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలది ప్రధానపాత్ర అని సీబీఐ ఆరోపిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details