తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రైం కథలు: బీమా ఏజెంట్ల దారుణాలు... విస్తుపోయే నిజాలు - bheema agents murders case

మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో ఉన్నవారితో బీమా చేయిస్తారు. రెండు మూడు నెలల కిస్తీలు కూడా వాళ్లే కడతారు. ఇంతలోనే బీమా చేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు... ఆ ఏజెంట్లు బీమా చేపించిన వ్యక్తులంతా ఇలానే ఉన్నట్టుండి ప్రమాదాల్లో మృత్యువాతపడతారు. ఇటీవలే ఓ వ్యక్తి కూడా అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుని తల్లి అనుమానంతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అక్కడ తీగలాగితే ఆ ఏజెంట్ల ముఠా డొంక కదిలి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

bheema agents murders for policy money in nalgonda district
bheema agents murders for policy money in nalgonda district

By

Published : Mar 2, 2021, 9:49 PM IST

Updated : Mar 2, 2021, 10:14 PM IST

అమాయకుల ప్రాణాలతో సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. నల్గొండ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బీమా సొమ్ము కోసం అమాయకులను హతమారుస్తున్న కిరాతకుల దారుణాలు అలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దామరచర్ల మండలంలోని రాళ్లవాగు తండకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ఉదంతంలో పాలుపంచుకున్న 17 మంది నిందితులను నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఒక బీమా ఏజెంటును సైతం పోలీసులు అదుపులోకి తీసుకోగా... మరొకరు పరారీలో ఉన్నారు.

తల్లి అనుమానంతో వెలుగులోకి...

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్​కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం రోజుల క్రితం నార్కట్​పల్లి అద్దంకి రహదారిపై అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కుటుంబ సభ్యులకు కోటిరెడ్డి భార్య తెలిపింది. అంతక్రియలు సమయంలో మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను గమనించిన అతడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు... తమదైన శైలిలో విచారించారు. పక్క గ్రామానికి చెందిన తన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసమే కోటిరెడ్డి హత్య చేశామని నిందితురాలు అసలు విషయాన్ని వెల్లడించింది. భాగస్వామిగా ఉన్న బీమా ఏజెంట్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బీమా ఏజెంట్.... గత మూడేళ్లుగా ఓ ముఠాను ఏర్పాటు చేసి ఈ అకృత్యాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. కొండ్రపోలు గ్రామంలో మరో ముగ్గురిపై కూడా ఇదే తరహా బీమా చేయించినట్టుగా విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు.

కిస్తీలూ వాళ్లే కడతారు...

ఈ ముఠా... మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో, వ్యసనాలకు బానిసై బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. వారి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేయిస్తారు. ఒకటి రెండు కిస్తీలు తామే కడతామని... కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని నెలల తర్వాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ముఠా సభ్యులు చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకుని... దాని సాయంతో బీమా క్లెయిమ్​ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్ పార్టీ సభ్యులతో పాటు బ్యాంకు సిబ్బందిని లంచాలతో మేనేజ్ చేస్తారు. వచ్చిన డబ్బుల్లో 20శాతం బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చి మిగిలిందంతా ముఠా సభ్యులు పంచుకుంటారు.

వెలుగుచూస్తున్న కథలు...

నాగార్జునసాగర్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని... వాటిపైనా విచారణ చేపడుతున్నామన్నారు. గతంలో మిర్యాలగూడలోని ఓ వ్యక్తిపై రూ. కోటి బీమా చేయించి ప్రమాదంలో చనిపోయాడని నమ్మించారు. వచ్చిన డబ్బుల్లో అతడి భార్యకు 20 శాతం ఇచ్చి మిగిలినదంతా ముఠా సభ్యులు పంచుకున్నారు. 2018లో గుంటూరులో రూ.50 లక్షల బీమా చేయించి ఓ వ్యక్తి ప్రాణాలు తీసి నగదు నొక్కేశారు. ఈ కేసులో అరెస్టయిన బీమా ఏజెంట్... బెయిల్​పై వచ్చి మళ్లీ దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల కిందట పోలీసులు ఇలాంటి ముఠా ఆట కట్టించి కటకటాల వెనక్కి నెట్టగా... ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో కొందరి వ్యవహారంపై సీబీఐ ఏకంగా అంతర్గత విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి:మూడేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసిన పిన్ని

Last Updated : Mar 2, 2021, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details