తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణం తీసిన పంది మాంసం.. పందెం కట్టి మరీ..! - పంది మాసం గొంతులో ఇరుక్కొని

Man Died by Pork Meat: అకతాయిగా చేసే పనులు కొన్నిసార్లు లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. మరికొన్ని సార్లు ప్రాణాలు బలి తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అచ్చం అలాంటి ఘటనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. పచ్చి పంది మాంసం తినటానికి పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

a-man-died-with-ate-pork-meat-in-srikakulam
a-man-died-with-ate-pork-meat-in-srikakulam

By

Published : Jun 22, 2022, 8:24 PM IST

Man Died by Pork Meat: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆంధ్రా వీధికి చెందిన యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం పంది మాంసం కోసం దుకాణానికి వెళ్లిన ఈశ్వరరావు.. సరదాగా ఓ పచ్చి ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని స్నేహితులు.. ఈశ్వరరావును ఆటపట్టించాలనుకున్నారు. ఒక్క ముక్క అలా తినటం గొప్పేమి కాదని.. పచ్చిది ఇంకోటి తినలేవని రెచ్చగొట్టారు. కావాలంటే ఇంకోటి తిని చూపించాలని అకతాయిగా పందెం కాశారు.

ఇంకేముంది.. వాళ్ల మాటలకు ఈశ్వరరావు పౌరుషానికి పోయాడు. తాను ఇంకో పచ్చి ముక్క తినగలనని నిరూపించుకోవాలని పందేనికి సై అన్నాడు. ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు మరో ముక్కను నోట్లో వేసుకున్నాడు. మొదటిది సులువుగానే తిన్న ఈశ్వర్​రావు.. రెండోది కూడా అలవోకగా తినగలనని ఊహించాడు. కానీ.. అదికాస్త గొంతుకు అడ్డం పడింది. ఈశ్వరరావుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు.

ఈశ్వర్​రావు పరిస్థితి చూసి ఆందోళన చెందిన అతని స్నేహితులు.. ఓ రిక్షాపై హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అకతాయిగా చేసిన ఓ పని.. ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. కాగా..ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details