మున్నాభాయ్ అలియాస్ అబ్ధుల్ సమద్ … ది హైవే కిల్లర్. కరుడుగట్టిన హంతకుడు. కోడిని చంపినంత తేలిగ్గా మనుషుల పీకలు తెగ్గోస్తాడు. శవాల్ని గోనెసంచుల్లో కట్టి దగ్గర్లోని కాల్వల వద్ద పూడ్చేస్తాడు. ఈ పని చేసినందుకు అసలు పశ్చాత్తాప పడడు. ఒక దారుణ హత్య..తరువాత వంతు ఎవరిదని ఎదురు చూస్తూంటాడు. ఇలాంటి కిరాతక పనుల కోసం 16 మందితో అతనో ప్రత్యేక ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా మీదుగా వేళ్లే లారీలు ఈ ముఠా టార్గెట్. పోలీసు దుస్తులు వేసుకుని ట్రక్లు ఆపడం డ్రైవర్లు, క్లీనర్లను కిడ్నాప్ చేయడం పీకలు తెగ్గోయడం వీరి నేర విధానం. హత్యాకాండ తర్వాత లారీలోడ్ను అమ్మేయడం, వచ్చిన సొమ్మును జల్సా చేయడం.. అది ఖర్చవగానే మరో నేరానికి బయల్దేరడం ఈ ముఠా స్టయిల్. చెన్నై -కోల్కతా ప్రధాన రహదారి అడ్డాగా సాగిన మున్నాభాయ్ గ్యాంగ్ దారుణ హత్యాకాండ 2008లో వెలుగు చూస్తే 2021 మే 24 న కోర్టు తీర్పుతో ముగింపు దశకు చేరింది.
ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఏం జరిగిందంటే..
కోల్కతా-చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారిలో 2008లో కొన్ని లారీలు, వాటిలో ఉన్న సరకు అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో అప్పటి ట్రైనీ డీఎస్పీగా పనిచేసిన దామోదర్కు ఓ క్లూ లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటనలు వెలుగు చూశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా ఒక గ్యాంగ్ను తయారు చేసుకున్నాడు. అంతకు ముందు గుప్తనిధులు ఆచూకీ చెబుతానని కొంతమంది ధనవంతులను నమ్మించి, వారి వద్దనుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. దీనివల్ల ప్రయోజనం లేదని దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించాడు.