వరంగల్ పార్లమెంటుపై భాజపా ధీమా ఓరుగల్లు కోటపై కాషాయ జెండా రెపరెపలాడించేందుకు ఉవ్విళ్లూరుతోంది కమల దళం. ఇక్కడ భాజపా గెలిచింది ఒక్కసారే... అయినా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. 1984లో రెండు స్థానాల్లో భాజపా గెలిస్తే ఓ స్థానం హన్మకొండ. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి విజయం ఎంత సంచలనం సృష్టించిందో... పీవీ నర్సింహారావు పరాజయం అంతే సంచలనమైంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హన్మకొండను వరంగల్లో కలిపి కొత్తగా మహబూబాబాద్ను ఏర్పాటు చేశారు. పరకాల, వర్ధన్నపేట, శాయంపేట అసెంబ్లీ స్థానాల్లో భాజపాకు పట్టున్నప్పటికీ...తరువాత పరిస్థితి మారిపోయింది. వికసించాల్సిన కమలం రోజురోజుకూ ముడుచుకుపోతోంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి మినహా ఎక్కడా...చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు.
పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపంతో ఎవరికి వారే అన్న చందంగా భాజపా వ్యవహారం కనిపిస్తోంది. పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడం, పొత్తుల కారణంగా టికెట్లు దక్కకపోవడం, గ్రూపు తగాదాలతో శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాల్లో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థిగా సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తిని రంగంలోకి దించింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే... నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు తనకో అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. వరంగల్లో విజయం సాధించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు.
చింతా సాంబమూర్తి విజయం కోరుతూ.... ఈ నెల 4న అమిత్ షా వరంగల్లో పర్యటించనున్నారు. అమిత్ షా రాకతో.. జోష్ పెరిగి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలుపుబాటలో పయనిస్తామని కమలనాథులు విశ్వాసంతో ఉన్నారు.
ఇవీ చూడండి:నాయనమ్మను ఆదరించిన గడ్డమీద మనవడి ప్రచారం