తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రధాని ప్రకటనతో.. కాకతీయ మెగా జౌళి పార్కుకు మోక్షం? - కాకతీయ మెగా జౌళి పార్కు

Kakatiya Mega Textile Park: రాష్ట్రంలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనతో ప్రభుత్వ, పారిశ్రామిక, జౌళి వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అర్హతలు.. వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా జౌళి పార్కుకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా ప్రకటన ఆశాజనకంగా మారింది.

Kakatiya Mega Textile Park
Kakatiya Mega Textile Park

By

Published : Jul 4, 2022, 8:08 AM IST

Kakatiya Mega Textile Park: తెలంగాణలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రభుత్వ, పారిశ్రామిక, జౌళి వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అర్హతలు.. వరంగల్‌ జిల్లా శాయంపేట-చింతలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా జౌళి పార్కుకు ఉన్నాయి. ప్రధాని తాజా ప్రకటన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మెగా జౌళి పార్కును ఏర్పాటు చేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌ జిల్లా శాయంపేట-చింతలపల్లి వద్ద కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టింది. దీని కోసం 1200 ఎకరాల్లో భూములను సేకరించి రూ.300 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టింది. భూసేకరణ అనంతరం దాదాపు ఎనిమిది పరిశ్రమలకు స్థలాలను కేటాయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా దీన్ని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రతిపాదనలనూ రూపొందించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పించడానికి రూ.897 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. గ్రాంటు రూపంలో సాయం అందించాలని కోరగా.. దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర జౌళి, చేనేత శాఖల మంత్రి కేటీఆర్‌ దాదాపు పదిసార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సంతోష్‌ గంగ్వార్‌, పీయూష్‌ గోయల్‌లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. బడ్జెట్‌ సందర్భంగా కూడా లేఖలు రాశారు. అయినా కేంద్రం నుంచి స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా ప్రకటన ఆశాజనకంగా మారింది. కాకతీయ జౌళి పార్కుకు కేంద్రం సాయం అందిస్తే మౌలిక వసతులకు సంబంధించిన పనులు సత్వరమే పూర్తవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సరఫరా, ఆర్వోబీ నిర్మాణం, ఇతర పనులు జరుగుతాయి. ఇప్పటికే అక్కడ భూములు తీసుకున్న వాటిలో సగం సంస్థలు మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తూ నిర్మాణ పనులు చేపట్టలేదు. కేంద్రం నుంచి నిధులు వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే వీలుంది.

వెంటనే మంజూరు చేయాలి..తెలంగాణకు మెగా జౌళిపార్కు ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ వెంటనే దాన్ని మంజూరు చేయాలని, లేనిపక్షంలో నమ్మే పరిస్థితి ఉండదని రాష్ట్ర చేనేత సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు మండల శ్రీరాములు పేర్కొన్నారు. ప్రధాని ప్రకటన విషయంలో అనేక అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే విభజన హామీలతో పాటు కొత్త ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ సహా మంత్రులంతా ఎన్నోసార్లు విన్నవించినా, లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందించలేదు. హామీలన్నింటిపై ప్రధాని నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఒక్కదానిపైనా ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వలేదు’’ అని రాములు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details