తెలంగాణ

telangana

ETV Bharat / city

మినీ పోల్స్​: వేడెక్కిన ప్రచారపర్వం... రంగంలోకి ముఖ్య నాయకగణం - మున్సిపల్​ ఎన్నికలు

డివిజన్లు, వార్డుల్లో పార్టీల అభ్యర్థులు ఇంకా కుదురుకోనేలేదు . ఓటర్లను ప్రత్యక్షంగా ఇంకా కలవనేలేదు. కొందరైతే ఓటరు జాబితాను తిప్పి తిప్పి చూసుకుని ఓటర్ల పరిధి తెలుసుకునేందుకే అష్టకష్టాలు పడుతున్నారు. ముంచుకొస్తున్న ప్రచార ముగింపు గడువు పార్టీలు, అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పేరుకే పోలింగ్‌కు ఏడురోజుల సమయమున్నా... నాలుగు రోజుల్లోనే ప్రచారానికి తెరపడనున్న తరుణంలో మినీ పురపోరులో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి.

mini municipal elections campaign
mini municipal elections campaign

By

Published : Apr 24, 2021, 3:51 AM IST

మినీ పురపోరుకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో దడ పుడుతోంది. కరోనా ప్రభావంతో ప్రచారాన్ని ఒకరోజు ముందే కుదిస్తూ ఎస్​ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ప్రచారానికి మిగిలింది కేవలం నాలుగురోజులే కావడంతో రాజకీయ పార్టీలు, బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. ప్రచారం మరింత వేగం పెంచేలా ప్రణాళికలు చేస్తున్నాయి. ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపి డివిజన్ల బాధ్యతలు అప్పగించాయి. అభ్యర్థుల కుటుంబమంతా మద్దతుగా కాలనీలను చుట్టేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.

గెలుపుపై కన్నేసిన అధికార ప్రతిపక్షాల మధ్య పురపోరులోనూ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి అజెండాను అధికార తెరాస ప్రస్తావిస్తుండగా... హామీల అమలులో విఫలమైందంటూ విపక్షాలు తిప్పికొట్టేప్రయత్నం చేస్తున్నాయి. ఖమ్మంలో తెరాస ప్రచార బాధ్యతల్ని మంత్రి పువ్వాడ అజయ్ అన్నీ తానై నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో పాలకవర్గం చేపట్టిన అభివృద్ధితో పాటు భవిష్యత్‌లో చేయబోయే కార్యక్రమాలను అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళుతోంది.

ప్రజా సమస్యలే అజెండాగా కాంగ్రెస్‌, భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎల్పీ నేత నేత భట్టి విక్రమార్క, ఎన్నికల కన్వీనర్‌గా ఉన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ సహా ఇతర జిల్లా ముఖ్యనేతలంతా ఓటర్లను కలుస్తున్నారు. భాజపా మన ఖమ్మం- మన కమలం నినాదంతో ఓటర్ల దరిచేరుతోంది.

వరంగల్ నగర పాలక సంస్ధ ఎన్నికల్లో ప్రచారపర్వం ఊపందుకుంది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా భారీ బహిరంగసభలకు అనుమతి లేకపోవడం వల్ల అభ్యర్థులు డివిజన్లను చుట్టేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం నుంచే ఓటర్ల ఇంటి బాట పడుతున్నారు.

కాంగ్రెస్ తరఫున అభ్యర్ధులు ఆయా డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కమలం అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓరుగల్లో ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయాలంటూ అభ్యర్థుల తరఫున మంత్రి సత్యవతి రాథోడ్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రచారం నిర్వహించారు.

మినీ పురపోరు ఎన్నికల ప్రచారపర్వంపై కొవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డివిజన్ల వారీగా ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు సమూహంగా తమ గడప తొక్కొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు.

ఇదీ చూడండి: మినీపోరుకు హోరాహోరీగా పార్టీల ప్రచారం..!

ABOUT THE AUTHOR

...view details