వరంగల్ గ్రామీణ జిల్లా డమేర మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రకృతి పార్కు పనులను దేవాదుల అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రతీ గ్రామంలో ప్రకృతి పార్క్ను ఏర్పాటు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో.. వెంకటాపూర్ గ్రామంలో ఖాళీగా ఉన్న దేవాదుల పథకం క్రింద ప్రభుత్వం తీసుకున్న భూమిలో.. 20 గుంటల భూమిని గ్రామపంచాయతీ సర్పంచ్, మండల స్థాయి అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల నుంచి ఆ ప్రదేశంలో జేసీబీతో గ్రామపంచాయతీ సిబ్బంది పనులు చేయిస్తున్నారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం.. నిలిచిన పనులు
వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రకృతి పార్కు పనులను దేవాదుల ప్రాజెక్టు అధికారులు శుక్రవారం నిలిపివేశారు. దేవాదుల ఎత్తిపోతల్లో భాగంగా ఈ భూమిని భూసేకరణ క్రింద తీసుకున్నామని, దీనిపై సర్వఅధికారాలు తమకే ఉంటాయని డీఈ తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో పనులు జరుపకూడదని వారు తెలిపారు.
శుక్రవారం పనులు జరుగుతున్న సమయంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు డీఈ, ఏఈఈ తదితరులు ప్రదేశానికి వచ్చి పనులు నిలిపివేయించారు. ఈ భూమిని తాము భూసేకరణ క్రింద తీసుకున్నామని, దీనిపై సర్వాధికారాలు తమకే ఉంటాయన్నారు. ఇప్పటికే ఈ ప్రదేశంలో దేవాదుల సొరంగం రెండు లైన్లు ఉన్నాయని, దీనికి తోడు ప్రక్కనే మరో మూడు లైన్లు రాబోతున్నాయని... ఇటువంటి సమయంలో తమ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే పనులు జరుపకూడదని వారు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రజని పార్కు ఏర్పాటు చేయబోయే స్థలానికి వెంటనే చేరుకుని దేవాదుల అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, సర్పంచ్తో మాట్లాడారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు.