వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సంక్రాంతి మొదలు ఉగాది వరకు మూడు నెలలు సాగే మల్లన్న జాతరకు లక్షలాది మంది తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తు బోనాలు, పెద్దపట్నాలు, ఎడ్లబండ్ల ఊరేగింపు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారు. శివసత్తుల నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య ఐనవోలు మల్లన్న జాతర సాగుతోంది. ఈ జాతరలో ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోలు వాద్యాలు.. డీజే పాటలతో కుర్రకారు ఉత్సాహంగా ఆడి పాడి కేరింతలు కొట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ఏర్పాట్లపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొంత మంది భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్ళొచ్చే ఏడాదికి జాతరలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని కోరారు భక్తులు.
తుంగలో నిబంధనలు
జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో అధికారుల నిర్వహణ వికటించింది. జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. జాతరలో ఎక్కడ చూసినా... చెత్తచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. మాస్క్ లేనిదే మల్లన్న దర్శనం లేదని స్వయాన మంత్రి చెప్పినా ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు ఎక్కడున్నాయో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందిస్తామని చెప్పి.. కనీసం జాతరలో ఒక్క అధికారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఐనవోలు వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఐనవోలు ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని నిధులు కేటాయించి వచ్చే ఏడాదికైనా మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.