ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ రహదారి-44పై ప్రయాణానికి జంకుతున్న వాహనదారులు - నేషనల్ హైవే-44

ఆ హైవే ప్రయాణీకులను హడలెత్తిస్తోంది. తరచూ ప్రమాదాలతో భయాందోళనకు గురిచేస్తోంది. ఆ రహదారి గుండా ప్రయాణమంటేనే నిజామాబాద్‌ జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్‌లు, కనిపించని ప్రమాద సూచికలు, అతివేగం కారణంగా.... ప్రయాణీకులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులకు టోల్ వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల రక్షణ విషయంలో కరవైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

vehicle holders square for travelling on national highway-44
జాతీయ రహదారి-44పై ప్రయాణానికి జంకుతున్న వాహనదారులు
author img

By

Published : Nov 30, 2020, 4:12 PM IST

జాతీయ రహదారి-44పై ప్రయాణానికి జంకుతున్న వాహనదారులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది. నిత్యం జాతీయ రహదారిపై 15వేలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి జిల్లాలో బిక్కనూర్ వద్ద, నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ హైవేపై ఎక్కువగా యూటర్న్ లు, డివైడర్‌లు ఉన్న ప్రాంతాల్లోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అవసరమున్న చోట అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం, గ్రామాల నుంచి నేరుగా హైవే మీదకు వచ్చేలా డివైడర్లు ఇవ్వడమే దుర్ఘటనలకు కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

నిత్యకృత్యంగా ప్రమాదాలు
44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందల్వాయి మండలం గన్నారం కమాన్, ఇందల్వాయి కమాన్ వద్ద ఆయా గ్రామాల నుంచి వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి వచ్చేస్తాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండా మోడల్ పాఠశాల వద్ద, పోలీస్‌స్టేషన్ ఎదురుగా, తెలంగాణ యూనివర్శిటీ కమాన్, క్రిస్టియన్ మెడికల్ కళాశాల, సాంపల్లి వద్ద డివైడర్లు, యూటర్న్‌లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్, సికింద్రాపూర్, ఆర్మూర్ మండలం పెర్కిట్, బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.

నిర్వహణ లోపంతోనే..

జిల్లాలో హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినా.. జాతీయ రహదారుల సంస్థ మాత్రం కేవలం సదాశివనగర్‌పై వంతెన, పెర్కిట్ చౌరస్తాను మాత్రమే బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించింది. టోల్‌ప్లాజాల నిర్వాహకులు రోడ్డు నిర్వహణతో పాటు రక్షణ చర్యలూ చేపట్టాల్సి ఉంది. ప్రయాణీకులకు రాత్రివేళలో రోడ్డు కనిపించేలా రేడియం ఇండికేటర్‌లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు బ్లాక్‌స్పాట్‌లు గుర్తించిన ప్రదేశాల్లో సిబ్బందిని నియమించి వాహనాలను పర్యవేక్షించడం సహా... జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల డివైడర్‌ల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. లక్షల రూపాయలు టోల్ వసూలు చేస్తున్నా నిర్వహణ సరిగ్గా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రహదారి నిర్మాణ సమయంలో గుత్తేదారు నిబంధనలకు విరుద్ధంగా డివైడర్‌లు నిర్మించడమే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:మైనర్​ను రేప్​ చేసి.. గొంతుకోసి.. ఆపై బావిలో పడేసి..

ABOUT THE AUTHOR

...view details