వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు యాసంగిలో అంచనాలకు మించి వరి సాగు చేసారు. జిల్లాలో సాధారణం కంటే 151 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. బోర్లపై ఆధారపడి ఎక్కువ మంది వరి పంట సాగు చేశారు. ఎండల ధాటికి భూగర్భ జలాలు పడిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా నిండటం లేదు. గత వానాకాలంలో చేరిన నీటితో వర్షాకాలం పంటలు గట్టెక్కినా యాసంగికి మాత్రం తిప్పలు తప్పటం లేదు. యాసంగి పంటకు వచ్చే సరికి భూగర్భ జలాలు తగ్గిపోయి చాలా చోట్ల బోర్లు వట్టిపోయి యాసంగి పంటల దిగుబడి మీద తీవ్ర ప్రభావం పడుతోంది.
రైతుల ఆవేదన..
యాసంగి ప్రారంభంలో బోర్ల నుంచి నీరు పుష్కలంగా వచ్చింది. రెండో పంటకు ఢోకా లేదని రైతులు ఉత్సాహంతో వరి సాగు చేపట్టారు. మరో నాలుగు తడులు నీళ్లందితే చేతికందే పంట... ప్రస్తుతం సాగునీరు లేక ఎండిపోయింది. ఒక్కో ఎకరానికి 20వేల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే భూమిలో పోసినట్టయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ఒక్కో ఎకరం 15వేలు చెల్లించి కౌలుకు తీసుకుని సాగుచేసినా కన్నీరే మిగిలిందని బాధను వ్యక్తం చేస్తున్నారు.