ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 33 గేట్లు ఎత్తి 4 లక్షల 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.1 అడుగుల నీటి మట్టం ఉంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ నదీ తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
చెరువుల అలుగులు.. చేపలకు వలలు..
నిజామాబాద్ నగర శివారులోని గుండారం చెరువు అలుగు పారుతూ జలపాతాన్ని తలపిస్తోంది. చెరువులోని చేపలు కొట్టుకుపోకుండా.. మత్స్యకారులు వలలు అడ్డు పెట్టారు. అలుగును చూసేందుకు స్థానికులు అధికంగా తరలి వస్తున్నారు. అలుగు నీరు రోడ్డుపైకి వస్తుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొండూర్ సమీపంలో పులాంగ్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో దాదాపు 900కు పైగా చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి.
ఉద్ధృతంగా మంజీర నది...
బోధన్ సరిహద్దు గ్రామం సాలుర వద్ద ఉన్న మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది పరవళ్లు వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల జనం పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి సందర్శకుల తకిడి మొదలైంది. కౌలాస్నాలా, నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రవాహం అధికమైంది. మంజీర నదిపై ఉన్న లోలేవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్త వంతెన మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్లటానికి ఎవరూ సాహసించొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి ఉగ్రరూపం.. జలదృశ్యం త్రివేణి సంగమం..
రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. తెలంగాణ, మహారాష్ట్రను కలిపే వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల ఇరు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నవీపెట్ మండలం నాలేశ్వర్, నందిపేట్ మండలం తల్వేద గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి కాలువపై ఉన్న వంతెన దెబ్బతింది. భారీ వాహనాలు వెళ్లడానికి వీలులేకుండా మారింది. ద్విచక్ర వాహనాలు వెళ్లేంత దారి మాత్రమే మిగిలి ఉండటంతో.. రాకపోకలను నిలిపివేశారు. అక్కడి పరిస్థితిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పంటలు నీట మునిగిన రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి ఉగ్రరూపం దాల్చటం వల్ల.. నది ఒడ్డున ఉన్న సీతారాం ఆశ్రమంలో ముగ్గురు స్వామీజీలు, 6 గోవులుతో సహా చిక్కుకున్నారు. వరద ప్రవహం పెరిగి సీతారాం ఆశ్రమం నీట మునిగింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బిల్డింగ్ పైకి ఎక్కి తలదాచుకున్నారు. వీళ్లను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
చెరువులైన పంటలు.. రైతులకు కన్నీళ్లు..