తెలంగాణ

telangana

By

Published : May 6, 2020, 9:34 PM IST

ETV Bharat / city

భూమి లేకపోయినా రుణం.. ఆలస్యంగా బయటపడిన బాగోతం

ఆ మహిళ పేరు మీద అసలు పట్టా భూమే లేదు. అయినా.. బ్యాంకు అధికారులు ఆమె పేరు మీద వేరే వ్యక్తికి రుణం మంజూరు చేశారు. పత్రాలేవి పరిశీలించకుండానే రుణమెలా ఇచ్చారని సదరు మహిళ భర్త ప్రశ్నిస్తే.. అసలు బాగోతం బయటపడింది.

Bank Officers Mistake In Issuing Loan In Nizamabad
భూమి లేకపోయినా రుణం.. ఆలస్యంగా బయటపడిన బాగోతం

నిజామాబాద్​ జిల్లా ఎడ్లపల్లి మండలం మంగళ్​ పహాడ్​ గ్రామానికి చెందిన చందూరు భోజన్న కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ తాను సంపాదించిన డబ్బులు అదే గ్రామంలోని సిండికేట్​ బ్యాంకులో ఖాతా ఉన్న భార్య లక్ష్మీ ఖాతాలో వేసేవాడు. కొన్నిరోజుల తర్వాత భోజన్న సోదరుడు భోజన్న వదిన అయిన లక్ష్మిని విదేశాలకు వెళ్లేందుకు బ్యాంకులో రుణం తీసుకుంటున్నానని, అందుకు నీ సంతకం కావాలని ఆమెను కోరాడు. వ్యవసాయ పట్టాదారు పాసు పుస్తకాలు కూడా కావాలని కోరాడు. మరిది భోజన్నకు సాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్మీ ఏమీ ఆలోచించకుండా పాసు పుస్తకం ఇచ్చి, సంతకం చేసింది. ఇదే అదునుగా భోజన్న రూ. లక్షా 10 వేలు పంట రుణానికి దరఖాస్తు చేశాడు. 2018 ఏప్రిల్​ నెలలో అధికారులు ఆమె ఖాతాలో ఆ డబ్బులు జమ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భోజన్న ఆ మొత్తాన్ని తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు.

భూమే లేదు.. రుణమెలా ఇచ్చారు?

విదేశాల నుంచి వచ్చిన లక్ష్మీ భర్త భోజన్న తాను జమ చేసిన డబ్బు తీసుకునేందుకు భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. నగదు కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు నగదు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా.. సదరు మహిళ రూ.లక్షా 10 వేలు పంట రుణం తీసుకుందని చెప్పారు. బ్యాంకు అధికారులు మాటలు విన్న భార్యభర్తలు అవాక్కయ్యారు. అసలు లక్ష్మీ పేరు మీద వ్యవసాయ భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రామస్తులు సైతం భోజన్న, లక్ష్మీలకు మద్ధతు పలికి బ్యాంకు అధికారులను నిలదీయగా.. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఆరా తీశారు. భోజన్న తమ్ముడి పేరు కూడా భోజన్నే కావడం వల్ల బ్యాంకు అధికారులు పొరబడి రుణం మంజూరు చేశామని తెలుసుకున్నారు. డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ సూచించగా వారు డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

నిబంధనలకు నీళ్లు వదిలారు..

భోజన్న భార్య లక్ష్మీ పేరు మీద భూమి లేకపోయినా.. బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా.. రుణం పొందే క్రమంలో సదరు షూరిటీ ఇచ్చే వ్యక్తికి కూడా భూమి ఉండాలి. కానీ.. బ్యాంకు అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. భోజన్న సోదరుడు భోజన్నకు షూరిటీ సంతకం పెట్టిన వ్యక్తికి సైతం భూమి లేదు. పట్టాదారు పాసు పుస్తకం లేదు. అంతకు ముందు బ్యాంకులో రుణం పొందలేదు. ఈ నిబంధనలేవి పాటించకుండానే బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేయడం పట్ల బాధితులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి:తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details