తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 5:37 PM IST

ETV Bharat / city

'సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు'

అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. అదే విధి ఆడే వింతనాటకం. మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అర్థంకాదు. ఎటు నుంచి ఎలాంటి కష్టం వచ్చిపడుతుందో తెలియదు.సాఫీగా సాగిపోయే ప్రయాణాల్లో కొన్నిసార్లు ఉప్పెనలు వచ్చి పడతాయి. సంతోషంగా సాగే నావను కష్టాలు, కన్నీళ్లతో ముంచేస్తాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబాన్ని పరిస్థితులు ఇలాగే కోలుకోలేని దెబ్బతీశాయి.

'సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు'
a family of nizamabad facing lot of problems cause of a road accident

'సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు'

మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. ఏడడుగులు కలిసి నడిచారు.. తోడు, నీడగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. మాట ప్రకారమే ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంపై కాలం పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్తను జీవచ్ఛవంలా మార్చేసింది. తన కుటుంబానికి దిక్కెవరని కుమిలిపోతున్న వేళ.. భార్య అండగా నిలిచింది. కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. చంటి పిల్లాడికి తల్లిలా అన్నీ తానై చూసుకుంటోంది. నేనున్నానని భర్తకు ధైర్యం నూరిపోస్తోంది.

ఊహించని ప్రమాదం..

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాకు చెందిన హన్మాండ్లు అనే వ్యక్తికి పదిహేడేళ్ల క్రితం కవితతో పెళ్లయింది. వారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లాడు. రియాద్‌ బల్దియాలో పనికి కుదిరాడు. దురదృష్టవశాత్తూ చెత్త డంపింగ్ చేస్తున్న హన్మాండ్లును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలై చాలా రోజులు కోమాలోనే ఉండిపోయాడు. ఒక మూత్రపిండం పూర్తిగా పాడవగా.. వెన్నుపూస, రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఆరు నెలలు సౌదీలోనే ఉన్న బాధితుడిని ఆ తర్వాత స్వగ్రామానికి పంపించారు. అప్పటి నుంచి అతన్ని మామూలు మనిషిని చేసేందుకు భార్య కవిత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఎకరం పొలం అమ్మేశారు. 7లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఐదేళ్లుగా మంచానికే పరిమితమై.. కనీసం లేవలేని దుస్థితిలో ఉన్నాడు...

బీడీలు చుడుతూ..

గ్రామంలోని నర్సరీలో పని చేయడంతోపాటు బీడీలు చుడుతూ కవిత కుటుంబాన్ని పోషిస్తోంది. ఫించను డబ్బులతో భర్తకు మందులు, ఇంటి అవసరాలు తీరుస్తోంది. హన్మాండ్లు వైద్యం కోసం ప్రతి నెలా రూ.6వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే ముగ్గురు కుమార్తెలను చదివిస్తోంది. పిల్లలతోపాటు భర్తకు సైతం బిడ్డగా సపర్యలు చేస్తోంది.

భార్యతోపాటు ముగ్గురు పిల్లలు హన్మాండ్లుకు సాయంగా నిలుస్తున్నారు. పిల్లలు ముగ్గురు కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని నడుచుకుంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన హన్మాండ్లు తల్లి కుమారుడి పరిస్థితితో డీలా పడిపోయింది. కుమారుడితో సేవలు చేయించుకోవాల్సిన వయసులో అతడికే సపర్యలు చేస్తోంది.

ఆదుకోవాలని విజ్ఞప్తి..

రోడ్డు ప్రమాదంతో చిన్నాభిన్నమైన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హన్మాండ్లు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన వైద్యంతోపాటు, పిల్లల చదువులకు మానవతా వాదులు ఆపన్న హస్తం అందించాలని వేడుకుంటున్నాడు.

ఇవీ చూడండి: అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విచారం

ABOUT THE AUTHOR

...view details