తెలంగాణ

telangana

ETV Bharat / city

ధన్యవాద సభతో వేడెక్కనున్న సాగర్ రాజకీయం - హాలియాలో ధన్యవాద సభ

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు... అప్పుడే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ధన్యవాద సభ పేరిట అధికార తెరాస ఏకంగా... ముఖ్యమంత్రినే రప్పిస్తోంది. సాగర్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే రూ.3 వేల కోట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నికల ప్రకటనకు ముందే పనులు ప్రారంభించబోతోంది.

minister jagadish reddy visit cm kcr meeting arrangements in haliya
ధన్యవాద సభతో వేడెక్కనున్న సాగర్ రాజకీయం

By

Published : Feb 9, 2021, 8:42 PM IST

ధన్యవాద సభతో వేడెక్కనున్న సాగర్ రాజకీయం

రేపు హాలియాలో జరగబోయే ముఖ్యమంత్రి సభతో... నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఇంకా ఎన్నికల ప్రకటన రాకున్నా... అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అన్ని పార్టీలు తలమునకలైనట్లే కనపడుతోంది. ఏకకాలంలో 11 ఎత్తిపోతల పథకాలు, మరికొన్ని ఆధునికీకరణ పనులకు రూ.3 వేల కోట్ల మంజూరు చేసి... ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు ప్రజలకు సంకేతాలచ్చింది అధికార పార్టీ. ఈ పథకాలన్నింటికీ రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు వద్ద... ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మొత్తం పథకాలను సైతం... నెల్లికల్లు వద్దే ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్, హుజూర్​నగర్, దేవరకొండ నియోజకవర్గాలకు... తాజా నిధుల ద్వారా లబ్ధి చేకూరనుంది. యాదాద్రి జిల్లాలో గంధమల్ల, బస్వాపూర్... సూర్యాపేట జిల్లాలో ఎస్​ఆర్​ఎస్పీతోపాటు కొత్త లిఫ్టులు, ఇక నల్గొండ జిల్లాకు సైతం నూతన లిఫ్టుల ద్వారా లబ్ధి చేకూరుతున్నందున... ఉమ్మడి జిల్లా తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపేలా ధన్యవాద సభకు రూపకల్పన చేశారు. బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.

భారీ జనసమీకరణ..

బుధవారం మధ్యాహ్నం... ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం... సాగర్ బీసీ గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ దిగి రహదారి మార్గాన... నెల్లికల్లుకు చేరుకుని ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి సాగర్​కు చేరుకోనున్న సీఎం... విజయ్ విహార్ లేదా గుత్తా సుఖేందర్ రెడ్డి క్వార్టర్స్​లో కాసేపు ఆగి పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం... హెలికాప్టర్​లో హాలియాకు చేరుకోనున్నారు. హాలియా పురపాలక సంఘం పరిధిలోని 14వ మైలు వద్ద సభా ప్రాంగణం నిర్మించగా... దానికి సమీపంలోనే హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇక సీఎం రాక దృష్ట్యా రెండు లక్షల మందిని సమీకరించేలా... పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని రప్పించేలా... కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించేలా... ఇప్పటికే శాసనసభ్యులందరికీ ఆదేశాలు అందాయి. సభ నిర్వహణను మంత్రి జగదీశ్ రెడ్డికి... నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​కు అప్పగించారు.

వేడెక్కుతున్న సాగర్..

సీఎం సభ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉండనున్నందున... ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇష్టం లేదని పైకి చెబుతున్నా... పార్టీలోని కొందరు సీనియర్లు సైతం టికెట్ రేసులో ఉన్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారంతో... ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేలా అభ్యర్థిత్వ ప్రకటన ఉండాలన్న అభిలాష గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అటు భారతీయ జనతా పార్టీ సైతం... సాగర్ ఉప ఎన్నికపై కన్నేసింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తోపాటు కీలక నేతలంతా... ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇంజినీర్ల సూచనల మేరకు కాకుండా... నెల్లికల్లు లిఫ్టుకు సరైన ప్రణాళికలు రూపొందించలేదంటూ భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సీఎం సభను అడ్డుకుంటామన్న రీతిలో ప్రకటనలు చేశారు. ఇలా అన్ని పార్టీల వాదప్రతివాదాలకుతోడు రేపటి సీఎం సభతో... నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు

ABOUT THE AUTHOR

...view details