తెలంగాణ

telangana

'గల్లీలో నీతులు సరే కేటీఆర్.. దిల్లీలో మీ చెల్లి అవినీతి కథ ఏంటి ?'

Komatireddy Comments on KTR: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ వేదికగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. గల్లీలో నీతులు సరే.. దిల్లీలో మీ చెల్లి అవినీతి కథ ఏంటి అని కేటీఆర్​ను ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో కేటీఆర్ నీ వాటా ఎంత అని ట్విటర్‌లో ఆరోపించారు. అలాగే తనకు పదవులు అవసరం లేదని... ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే పయనిస్తానని వెంకటరెడ్డి చెప్పారు.

By

Published : Oct 13, 2022, 8:12 PM IST

Published : Oct 13, 2022, 8:12 PM IST

Komatireddy fire on KTR
Komatireddy fire on KTR

Komatireddy Comments on KTR: ట్విటర్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మధ్య విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి కేటీఆర్‌కు పలు ప్రశ్నలు సంధించారు. 'గల్లీలో నీతులు సరే.. దిల్లీలో మీ చెల్లి అవినీతి కథ ఏంటి' అని ప్రశ్నించారు. గల్లీలో పాఠాలు బానే చెప్తావ్‌ కేటీఆర్.. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో నీ వాటా ఎంత అంటూ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం లక్ష కోట్లలో నీ కోటా ఎంత అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే.. తనకు పదవులు అవసరం లేదని... ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే పయనిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆర్నెళ్ల ముందే టికెట్లు ప్రకటించాలని అధిష్ఠానానికి సూచించారు. తెరాసలో ఏ నేత ఉంటారో... బయటికి వెళతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. చుక్కనీరు రాని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షకోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్‌ రైతుల రుణ మాఫీ చేసేందుకు చేతులు రావడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు, పక్కా ఇళ్లు కట్టించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

అలైన్‌మెంట్‌ మార్చండి.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం.. దౌర్జన్యంగా సర్వేలు చేయడం మంచి పద్ధతి కాదని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు. ట్రిబుల్‌ ఆర్‌ వల్ల భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు.. భూములు కోల్పోయి, నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూములలో నుంచి రోడ్డు వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్చాలని... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అంతకుముందు తనను కోవర్ట్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోవర్టు అనే పదం వాడటానికి నీకున్న అర్హత ఏంటని.. ప్రశ్నించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. రాజకీయమంటే అప్పనంగా అధికారం అనుభవిస్తూ కోట్ల అవినీతి చేయటం కాదన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయటం అసలే కాదన్నారు.

'నేషనల్‌ మీడియాను అడిగితే కోవర్టులెవరో తెలుస్తోంది': నీ భాష.. పద్ధతేంటని.. ఇంతకీ చదివింది అమెరికాలోనా.. గల్లీలోనా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకున్నానని గుర్తు చేశారు. సాగరహారంలో తనను తాకిన రబ్బరు బుల్లెట్లను.. ఆనాడు తన వెంట నడిచిన లక్షలాది జనాలను అడగాలని రాష్ట్రంలో ఎవరు ప్రజానాయకులో.. ఎవరు కోట్లు వెనకేసుకున్న కోవర్టులో తెలుస్తుందన్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో నేషనల్‌ మీడియాను అడిగితే కోవర్టులెవరో నిజం బయటకు వస్తుందన్నారు.

'ఏ దేవాలయంలోనైనా చర్చించడానికి సిద్ధం':నువ్వు దిల్లీకి కోవర్టువు కాదని ఒట్టేసి చెప్పే దమ్ముందా అంటూ కేటీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్టులోనూ కమీషన్లు బొక్కే కల్వకుంట్ల ఫ్యామిలీ మీదని ఆరోపించారు. యాదాద్రి, భాగ్యలక్ష్మీ ఆలయం, వరంగల్ భద్రకాళి, బాసర సరస్వతి ఇలా ఎక్కడికైనా చర్చించడానికి తాను సిద్ధమని మీరు సిద్ధమేనా అని కేటీఆర్​ను ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details