Komatireddy Comments on KTR: ట్విటర్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి కేటీఆర్కు పలు ప్రశ్నలు సంధించారు. 'గల్లీలో నీతులు సరే.. దిల్లీలో మీ చెల్లి అవినీతి కథ ఏంటి' అని ప్రశ్నించారు. గల్లీలో పాఠాలు బానే చెప్తావ్ కేటీఆర్.. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో నీ వాటా ఎంత అంటూ వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం లక్ష కోట్లలో నీ కోటా ఎంత అని ట్విటర్లో వ్యాఖ్యానించారు.
ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే.. తనకు పదవులు అవసరం లేదని... ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్తోనే పయనిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆర్నెళ్ల ముందే టికెట్లు ప్రకటించాలని అధిష్ఠానానికి సూచించారు. తెరాసలో ఏ నేత ఉంటారో... బయటికి వెళతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. చుక్కనీరు రాని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షకోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ రైతుల రుణ మాఫీ చేసేందుకు చేతులు రావడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు, పక్కా ఇళ్లు కట్టించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
అలైన్మెంట్ మార్చండి.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం.. దౌర్జన్యంగా సర్వేలు చేయడం మంచి పద్ధతి కాదని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హితవు పలికారు. ట్రిబుల్ ఆర్ వల్ల భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు.. భూములు కోల్పోయి, నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూములలో నుంచి రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ మార్చాలని... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.