తెలంగాణ

telangana

పోటెత్తిన ధాన్యం.. చేతులెత్తేసిన మిల్లర్లు!

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకొనేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల అలసత్వం, ప్రణాళిక లోపం కారణంగా వందలాది మంది రైతులు ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇంతలోనే వర్షం ముంచుకు వచ్చి ధాన్యం తడుస్తుండడంతో ఓపిక నశించి అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు.

By

Published : Nov 2, 2021, 6:45 AM IST

Published : Nov 2, 2021, 6:45 AM IST

farmers issues
farmers issues

ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల అలసత్వం, ప్రణాళిక లోపం కారణంగా వందలాది మంది రైతులు ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు మిల్లర్లు కొనకపోవడం, మరోవైపు అధికారుల నిబంధనలు... ఇంతలోనే వర్షం ముంచుకు వచ్చి ధాన్యం తడుస్తుండడంతో ఓపిక నశించి అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మిర్యాలగూడలో చిన్నవి, పెద్దవి కలిపి 200 వరకు బియ్యం మిల్లులున్నాయి. వీటికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాల నుంచి రైతులు ధాన్యం తీసుకువస్తారు. సాధారణంగా దీపావళి తర్వాత మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈ దఫా బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో ముందుగా నాట్లు వేశారు. దీపావళికి ముందే వరికోతలు కోసి మిల్లులకు తరలించారు. ప్రస్తుతం తక్కువ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతుండడం, రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ధాన్యాన్ని మిల్లులకు తీసుకురావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. సోమవారం చిరుజల్లులు పడడంతో ధాన్యం తడిసి, రంగు మారుతోంది. ఇదే అదనుగా మిల్లర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాల్లో వరి కోతకు వస్తుంది. దీన్ని కూడా మిర్యాలగూడలో ఉన్న మిల్లులకే తరలించనున్నారు. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముంది. ఇప్పటి నుంచే అధికార యంత్రాంగం పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అధికారులు, పోలీసులు టోకెన్‌లు పొందిన రైతులు మాత్రమే మిల్లులకు ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టోకెన్లు ఉన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు.

వర్షానికి తడిసి... ఓపిక నశించి!

ధాన్యం అమ్మకాల కోసం నేరేడుచర్ల మీదుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్‌ మిల్లులకు వెళ్లే ట్రాక్టర్లను పోలీసులు మూసీ వంతెన సమీపంలో నిలిపేశారు. ఆదివారం రాత్రి వర్షం పడడంతో టార్పాలిన్‌ పట్టలతో కాపాడుకున్న రైతులు సోమవారం ఉదయం మిల్లుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెంటనే ధాన్యం కొనుగోళ్లకు అనుమతించాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. ఈ సంఘటనతో కోదాడ-జడ్చర్ల రహదారిపై ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. ఆందోళనలో పాల్గొన్న జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి మాట్లాడుతూ అధికారుల ప్రణాళిక లోపం కారణంగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పలుమార్లు మిర్యాలగూడ అధికారులతో మాట్లాడి ఆగిపోయిన ధాన్యం ట్రాక్టర్లను అన్నింటిని పంపిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత రైతులు ఆందోళన విరమించారు.సోమవారం సాయంత్రం వచ్చిన ట్రాక్టర్లను నేరేడుచర్ల మార్కెట్‌లో యార్డులో నిలుపుతున్నారు.

అధిక సంఖ్యలో ట్రాక్టర్లు రావడంతోనే

మిర్యాలగూడలో ప్రస్తుతం 46 మిల్లుల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. రైతులంతా ఒకేసారి కోతలు కోసి అధిక సంఖ్యలో ట్రాక్టర్లలో ధాన్యం తీసుకువస్తుండటంతో సమస్య ఏర్పడుతోంది. సోమవారం కురిసిన వర్షానికి చాలా ట్రాక్టర్లలోని ధాన్యం తడిసిపోయింది. ఇదంతా మిల్లుల్లోకి దిగుమతి చేసుకోవడానికి రెండ్రోజుల సమయం పడుతుంది. టోకెన్లు ఉన్న వారు రేపటి నుంచి ధాన్యం తీసుకురావాలి.

- గౌరు శ్రీనివాస్‌, అధ్యక్షులు, మిల్లర్స్‌ అసోసియేషన్‌, మిర్యాలగూడ

మద్దతు ధర ఇవ్వడం లేదు: శ్రీనివాస్‌రెడ్డి, రైతు, దిర్శించర్ల, సూర్యాపేట జిల్లా

తక్కువ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతుండటంతో అందరూ కలిసి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి మిల్లు వద్దనే ఉన్నా. మద్దతు ధర ఎక్కడా ఇవ్వడం లేదు.

అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు: మంత్రి గంగుల

ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనుగోళ్లు సాగుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,033 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. స్థానిక అవసరాల మేరకు వాటిని తక్షణం ఏర్పాటు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించామని మంత్రి వివరించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా కావాల్సినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వానాకాల ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సోమవారం తన కార్యాలయంలో సమీక్షించారు. గోనె సంచులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చేందుకు ప్రణాళిక పకడ్బందీగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు రవాణా సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి:Token system for grain purchase: నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ టోకెన్‌ విధానం

ABOUT THE AUTHOR

...view details