తెలంగాణ

telangana

ETV Bharat / city

దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు - Yadadri Lord receives 58 lakh as offerings in the last 15 days

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు శిల్పులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కొండపై ప్రధానాలయం 2.33 ఎకరాల విస్తీర్ణంలో... మాడవీధులు, ప్రాకారాలతో ఆలయ ప్రాంగణం 4.3 ఎకరాల్లో సిద్ధమవుతోంది.

దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

By

Published : Nov 18, 2019, 7:02 AM IST

Updated : Nov 18, 2019, 9:47 AM IST

దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.700 కోట్ల వరకు ఖర్చయింది. భూ సేకరణ, మిగిలిన పనులకు మరో రూ.400 కోట్ల వరకు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి కల్లా పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచారు. షిర్డీ, అక్షరధామం ఆలయాలలో నిర్మించిన విధంగా ఇత్తడి పైపులతో, ఆకర్షణీయంగా క్యూలైన్లను నిర్మించనున్నారు.

చెన్నైలో బంగారు పూత పనులు

ఇప్పటికే పూర్తైన ఆరు రాజగోపురాలపై బిగించనున్న కలశాలకు స్వర్ణ పూత పనులను చెన్నైలో చేపట్టారు. విమాన గోపురంపై స్వర్ణ పూత పనులను త్వరలోనే చేపట్టనున్నారు.

పనులు ఎందాకా వచ్చాయంటే...

  1. ప్రాజెక్టులో ప్రధానమైన గర్భాలయ పనులు ఓ రూపునకు వచ్చాయి.
  2. రాజగోపురాలన్నింటికీ టేకు ద్వారాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
  3. కొండ పైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, ఈ మార్గంలో నిర్మిస్తున్న గాలిగోపురం పనులు పూర్తికావొచ్చాయి.
  4. గర్భాలయ ప్రవేశ ద్వారం పక్కనే మందిర దృశ్యీకరణ, ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే రెయిలింగ్‌ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
  5. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లే మార్గంలో రెండు వైపులా భక్తాగ్రేసరులు, ఆధ్యాత్మిక చిహ్నాలను పొందుపర్చారు.
  6. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా చేపట్టిన శయన, బ్రహ్మోత్సవ మండపాలతో పాటూ అష్టభుజ మండప ప్రాకారాలు నిర్మాణంలో ఉన్నాయి.
  7. గర్భాలయంలో బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం పనులను చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

సాలహారాలతో శివాలయం నిర్మాణం
ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయ పునర్నిర్మాణం సాలహారాలతో సిద్ధమవుతోంది. ప్రధాన మందిరం, ముఖ మంటపం కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. నవగ్రహ మంటపం, యాగశాల, వినాయక మందిరం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్రితల రాజగోపురంతో ఆలయ ప్రహరీ సాలహారాలతో రూపొందించారు.

వేగంగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణాలు
ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో ప్రెసిడెన్షియల్‌ సూట్ల నిర్మాణం జరుగుతోంది. పెద్ద గుట్టపై నిర్మితం కానున్న ఆలయనగరిలో ఇప్పటికే రహదారులు, మినీపార్కులు ఏర్పాటుకాగా...కాటేజీల నిర్మాణానికి డిజైన్‌లు ఖరారు కావాల్సి ఉంది. కొండ కింద భక్తుల బస నిమిత్తం 100 గదుల సముదాయం తులసీ కాటేజీ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతోంది.

నిర్మాణంలో బాహ్యవలయ రహదారి
రూ.96 కోట్ల అంచనా వ్యయంతో కొండ చుట్టూ నిర్మితమవుతున్న బాహ్యవలయ దారుల నిర్మాణ పనులు గతంతో పోలిస్తే ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి.

సుదర్శన మహాయాగం
ఫిబ్రవరిలో సుదర్శన మహాయాగం తలపెట్టారు. గుట్టకు వాయవ్యంగా గండిచెరువు సమీపంలోని వందెకరాల్లో యాగం నిర్వహించాలని యాడా నిర్ణయించింది. సంక్రాంతికి ముందుగానే చిన జీయర్‌స్వామితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రాన్ని సందర్శించి యాగ నిర్వహణకు తుది సూచనలు చేయనున్నట్లు తెలిసింది.

చకచకా శిల్పకళ పనులు
ఫిబ్రవరికల్లా ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ దిశగానే ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావడం మా అదృష్టం. ఈ డిసెంబరు నెలాఖరులోపు ఆలయ శిల్పకళ పనులు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఇందుకు శిల్పులు రేయింబవళ్లు పని చేస్తున్నారు.

ఇదీ చదవండి: కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు

Last Updated : Nov 18, 2019, 9:47 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details