తెలంగాణ

telangana

ఉప ఎన్నిక ప్రచారంపై పార్టీ నేతలతో ఫోన్‌లో సీఎం ఆరా

By

Published : Apr 11, 2021, 5:11 AM IST

Updated : Apr 11, 2021, 5:48 AM IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య తనయుడైన భగత్‌కు ఆదరణ వెల్లువెత్తుతోందని చెప్పారు. ప్రచారంలో తెరాస మిగిలిన పార్టీలకు అందనంత దూరంలో ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ శ్రేణులు కొనసాగించాలని కోరారు. ఓటమి భయంతో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. సాగర్‌ ఉప ఎన్నికపై కేసీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. పలువురు మండల, బూత్‌ కమిటీ నాయకుల నుంచి సమాచారం తీసుకున్నారు.

cm kcr hope on nagarjuna sagar by election won and mejority
ఉప ఎన్నికపై ప్రచారంపై పార్టీ నేతలతో ఫోన్‌లో ఆరా

సాగర్‌ ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఇప్పటిదాకా అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రతీ ఓటరు నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు, నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు.ప్రచారానికి అయిదు రోజులే గడువున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి. అందరి మద్దతునూ కూడగట్టాలి. - కేసీఆర్, ముఖ్యమంత్రి.

సాగర్‌ అభివృద్ధి తెరాస పుణ్యమే

విపక్షాల వాదనల్లో పస లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్‌ అభివృద్ధి తెరాస పుణ్యమన్నారు. నియోజకవర్గంలో 95 శాతానికిపైగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నారని వివరించారు. నాగార్జునసాగర్‌, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు పచ్చగా కళకళలాడుతోందంటే అది ప్రభుత్వ ఘనతే అని వెల్లడించారు. నియోజకవర్గానికి సాగునీటితోపాటు తాగునీటినిచ్చి ఫ్లోరైడ్‌ను తరిమి కొట్టామని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించామని... ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు చెప్పుకోదగ్గ అంశం ఒక్కటీ కూడా లేదని అన్నారు కేసీఆర్. అవాకులు, చెవాకులు మాట్లాడితే ప్రజలు ఏమాత్రం నమ్మరని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.

ఎన్నికల సభ ఏర్పాట్లపై...

ఈ నెల 14న హాలియాలో సీఎం సభ ఉండగా దాని ఏర్పాట్ల గురించి కేసీఆర్‌ వాకబు చేశారు. ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయని మంత్రి, నేతలు చెప్పారు. సభకు భారీఎత్తున ప్రజలు తరలి వస్తారని చెప్పారు.

ఇవీ చూడండి:వేడెక్కిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారం

Last Updated : Apr 11, 2021, 5:48 AM IST

ABOUT THE AUTHOR

...view details